కలచివేసిందని పిఎం: అద్వానీతో జగన్, పొన్నం ఆగ్రహం
న్యూఢిల్లీ: లోకసభలో జరిగిన పరిణామాలు తనను మానసికంగా కలచివేశాయని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ బుధవారం అన్నారు. సభలో ఆంధ్రప్రదేశ్కు చెందిన ఇరు ప్రాంతాల ఎంపీలు ముష్టిఘాతాలకు దిగిన విషయం తెలిసిందే. దీనిపై పర్రధాని స్పందించారు. అన్ని విధాలుగా విజ్ఞప్తులు చేసినప్పటికీ ఇలా జరగడం సరికాదన్నారు. ఇలా జరగడం ప్రజాస్వామ్యానికి ఏమాత్రం మంచిది కాదన్నారు.
చిత్తశుద్ధి లేదు: ప్రకాశ్ జవదేకర్
తెలంగాణపై కాంగ్రెసు పార్టీకి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని బిజెపి సీనియర్ నేత ప్రకాశ్ జవదేకర్ అన్నారు. అందుకే కేంద్రమంత్రులు వెల్లోకి దూసుకు వెళ్లారన్నారు. పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించిన ముఖ్యమంత్రిని, కేంద్రమంత్రులను బహిష్కరించాలని డిమాండ్ చేశారు. తాము తెలంగాణకు మద్దతిస్తామని అదే సమయంలో సీమాంధ్రకు న్యాయం జరగాలన్నారు.
ప్రధాని వ్యాఖ్యలపై వెంకయ్య
తాను కలత చెందానన్న ప్రధాని వ్యాఖ్యల పైన బిజెపి సీనియర్ నేత వెంకయ్య నాయుడు స్పందించారు. మంత్రులు పోడియం వద్దకు వెళ్లడం ఇదే ప్రథమమన్నారు.
అద్వానీని కలిసిన జగన్
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం బిజెపి అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీని కలిశారు. బిల్లులోని లోపాలు ఆయన దృష్టికి తీసుకెళ్లి, పార్లమెంటులో తెలంగాణ బిల్లుకు సహకరించవద్దని కోరారు.
పొన్నం ఆగ్రహం
సీమాంధ్ర, తెలంగాణ మధ్య అంతరం పెరిగిపోయిందని, ఇక కలిసి ఉండలేమని కరీంనగర్ పార్లమెంటు సభ్యులు పొన్నం ప్రభాకర్ అన్నారు. బిల్లు ఆమోదానికి సీమాంధ్ర ఎంపీలు సహకరించాలని కోరారు. సభలో నిరసన చేస్తున్న సీమాంధ్ర నేతలు అనవసరంగా తమను రెచ్చగొట్టవద్దన్నారు. సీమాంధ్ర నేతలు సంస్కారహీనంగా వ్యవహరించారని, ఇంత దూరం వచ్చాక కలిసుండాలనడం అనైతికమన్నారు. రైల్వే బిల్లుకు కూడా అడ్డు రావడం సరికాదన్నారు.
తాము అహింసా పద్దతుల్లో పోతున్నామని, మీరు రెచ్చగొట్టడం వల్ల తెలంగాణ ప్రాంతంలో పిల్లలు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము సభలో ఎవరిని అడ్డుకోలేదన్నారు. బేషరతు మద్దతన్న బిజెపి ఇప్పుడు మెలికలు పెట్టడం సరికాదన్నారు. సీమాంధ్ర మంత్రుల విషయం పార్టీ చూసుకుంటుందని చెప్పారు.
సభలో సీమాంధ్ర మంత్రుల తీరు సరికాదని, దానిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని కోమటిరెడ్డి వెంకట రెడ్డి అన్నారు. సీమాంధ్ర నేతల కుట్రలు సాగనివ్వమని, తెలంగాణ సమస్యను పరిష్కరించాల్సింది పార్లమెంటేనని ఎంపి రాజయ్య అన్నారు.