మరాఠీ నవలా రచయిత భాల్ చంద్రకు జ్ఞానపీఠ్ అవార్డు
న్యూఢిల్లీ: ప్రముఖ మరాఠీ రచయిత భాల్చంద్ర వనాజీ నెమాడేకు (77) అత్యున్నత సాహత్య పురస్కారం జ్ఞానపీఠ్ అవార్డును ప్రకటించారు. ఆయన ప్రఖ్యాత రచన హిందు- జగన్యాచి సమృద్ధ అడగళ్కు 2014 సంవత్సరానికిగాను ఈ అవార్డు ప్రకటించారు. జ్ఞానపీఠ్ అవార్డుకు ఎంపికైన వారిలో ఈయన 50వ వారు. ప్రముఖ రచయిత నమ్వర్సింగ్ నేతృత్వంలోని జ్ఞానపీఠ్ ఎంపిక కమిటీ శుక్రవారం నెమాడే అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది.
తన రచనలతో మరాఠీ సాహిత్యానికి నెమాడే ఎనలేని సేవలు చేశారని కొనియాడింది. నెమాడేకు కేంద్ర ప్రభుత్వం 2011లో పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. 1990లో ప్రచురించిన టీకా స్వయంవర్ అనే విమర్శనా గ్రంథానికి ఆయన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు.
మహారాష్ట్రలోని సంగవి గ్రామంలో 1938లో నెమాడే జన్మించారు. పుణేలోని ఫెర్గూసన్ కళాశాల, డెక్కన్ కళాశాల్లో ఉన్నత విద్యను అభ్యసించారు. ముంబై యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ, డీ లిట్ పట్టాలు అందుకున్నారు. అదే యూనివర్సిటీలోని గురుదేవ్ ఠాగూర్ పీఠం చైర్మన్గా ఆయన పదవీవిరమణ చేశారు.

1963లో ప్రచురించిన మొదటి నవల కోసల నెమాడేకు ఎనలేని కీర్తిప్రతిష్ఠలు తెచ్చిపెట్టింది. అత్యంత మారుమూల ప్రాంతం నుంచి వచ్చి పుణే కళాశాలలో చేరిన పాండురంగ సంగ్వికార్ అనే యువకుడు ప్రధాన పాత్రగా సాగే ఈ నవల నిజానికి నెమాడే యుక్తవయసు అనుభవాలను ప్రతిబింబిస్తుందని అంటారు.
కవి, విమర్శకుడు, నవలాకారుడిగానే కాకుండా ఆయన మాతృభాష బోధన ఉద్యమకారుడిగా ఆయన చిరపరిచితుడు. నెమాడే మొత్తం నాలుగు నవలలు, రెండు కవితా సంపుటాలు, ఆరు విమర్శనాత్మక గ్రంథాలు వెలువరించారు












Click it and Unblock the Notifications