బీజేపీ ఇంత చిల్లర రాజకీయాలు చేయాల్సిన అవసరం ఏముంది: మాయావతి
ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి బీఎస్పీ అధినేత్రి మాయావతి బీజేపీ కాంగ్రెస్లపై ధ్వజమెత్తారు. రెండు పార్టీలు దళిత వ్యతిరేక పార్టీలుగా ఆమె అభివర్ణించారు. మాయావతి 63వ జన్మదిన వేడుకలు అమ్రోహాలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కార్యకర్తలు భారీ కేకును ఏర్పాటు చేశారు. అందులో ఓ కేకు ముక్క అందుకోవడం కోసం అభిమానులు కార్యకర్తలు పోటీపడ్డారు. ఈ క్రమంలోనే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కార్యకర్తలు అభిమానులు శాంతియుతంగా ఉండాలని నేతలు చెప్పడం వీడియోలో వినిపించింది. అయినప్పటికీ అభిమానులు సద్దమణగపోవడంతో అక్కడ గందరగోళ వాతావరణం నెలకొంది.
ఈ వీడియోను ట్విటర్లో పోస్టు చేయడంతో నెగటివ్ కామెంట్స్ వచ్చాయి. కొన్ని దళిత వ్యతిరేక శక్తులే ఈ కామెంట్స్ ఇచ్చారని తమకు ఎలాంటి ఇబ్బంది లేదని మాయావతి అన్నారు. అలాంటివి బహుజన్ సమాజ్ వాదీ పార్టీ పట్టించుకోదని వెల్లడించారు. బీఎస్పీపై బురదజల్లేందుకు బీజేపీ ఈ వీడియోను వాడుకుంటోందని మాయావతి ధ్వజమెత్తారు. ఉత్తర్ప్రదేశ్లో బీజేపీ ఎస్పీల కలయికను బీజేపీ జీర్ణించుకోలేకపోతోందని ఆమె మండిపడ్డారు.
రానున్న లోక్సభ ఎన్నికల్లో వారికి పరాజయం తప్పదని బీజేపీ నాయకులకు తెలుసు కాబట్టే ఇలాంటి చిల్లర రాజకీయాలకు తెరలేపుతున్నారని బెహెన్జీ ధ్వజం ఎత్తింది. కాన్షీరామ్కు తను శిష్యురాలని బీజేపీ నాయకులు గుర్తెరిగి ప్రవర్తించాలని మాయావతి సూచించారు. త్వరలో తన మేనల్లుడు ఆకాష్ను బీఎస్పీలో చేర్పించి కాన్షీరామ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంపై నేర్పిస్తానని మాయావతి చెప్పారు.
ఇదిలా ఉంటే ఎస్పీ బీఎస్పీల పొత్తును చారిత్రక అవసరంగా ఇరు పార్టీల నేతలు ప్రకటించారు. 80 లోక్సభ స్థానాలున్న ఉత్తర్ప్రదేశ్లో ఎస్పీ బీఎస్పీ చెరో 38 స్థానాల్లో పోటీచేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. అందులో కాంగ్రెస్కు రెండు సీట్లు వదిలేశారు. రాయ్బరేలీ, అమేథీ లోక్సభ స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులను బరిలో నిలపడం లేదని స్పష్టం చేశారు.