వైద్య చరిత్రలో వింత: పురుషుడికి గర్భాశయం !
మధ్యప్రదేశ్లో వైద్యరంగం నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలిచే ఓ వింత ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ 47 ఏళ్ల పురుషుడికి గర్భాశయం ఉందని నిర్ధారిస్తూ డయాగ్నోస్టిక్ సెంటర్ ఇచ్చిన నివేదిక ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అసలు విషయానికొస్తే.. మధ్యప్రదేశ్లోని సత్నా జిల్లాలోని ఉచెహ్రా నగర్ పంచాయతీ అధ్యక్షుడు నిరంజన్ ప్రజాపతి(47) గత కొన్ని రోజులుగా కడుపునొప్పి, వాపుతో బాధపడుతున్నారు. దీని కోసం ఆయన జనవరి 13న సత్నా స్టేషన్ రోడ్డులోని 'సత్నా డయాగ్నోస్టిక్ సెంటర్'లో సోనోగ్రఫీ చేయించుకున్నారు.
రిపోర్ట్ చూసి డాక్టర్లే షాక్!
సోనోగ్రఫీ నివేదిక వచ్చిన తర్వాత అందులోని అంశాలు చూసి నిరంజన్ ప్రజాపతితో పాటు వైద్యులు కూడా అవాక్కయ్యారు. నిరంజన్ ప్రజాపతికి గర్భాశయం ఉందని, అది తిరగబడిన స్థితిలో ఉందని రిపోర్టులో పేర్కొన్నారు. మొదట ఆయన ఆ రిపోర్ట్ చూసుకోకుండా మందులు వాడారు. అయినా నొప్పి తగ్గకపోవడంతో జబల్పూర్లోని మరో డాక్టరును సంప్రదించారు. అక్కడి వైద్యుడు రిపోర్టును చూసి, "ఇది అసాధ్యం.. ఒక పురుషుడికి గర్భాశయం ఉండటం ఏంటి? ఈ రిపోర్ట్ నీది కాదు" అని తేల్చిచెప్పారు.

బాధితుడి ఆవేదన
"నా పేరుతో ఉన్న రిపోర్టులో గర్భాశయం ఉందని రాయడం చూసి నేను షాక్ అయ్యాను. కడుపునొప్పి అని వెళ్తే ఇలాంటి తప్పుడు నివేదిక ఇవ్వడం వల్ల నా ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది" అని నిరంజన్ ప్రజాపతి ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వైద్యాధికారుల స్పందన
ఈ ఘటనపై సత్నా చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ మనోజ్ శుక్లా స్పందించారు. "ఈ ఫిర్యాదు మా దృష్టికి వచ్చింది. దీనిపై సమగ్ర విచారణ జరిపిస్తాం. నివేదికలో అవకతవకలు జరిగినట్లు తేలితే సదరు డయాగ్నోస్టిక్ సెంటర్పై కఠిన చర్యలు తీసుకుంటాం" అని ఆయన హామీ ఇచ్చారు. కాగా, ఈ అంశంపై స్పందించేందుకు సత్నా డయాగ్నోస్టిక్ సెంటర్ వైద్యుడు డాక్టర్ అరవింద్ సరాఫ్ నిరాకరించారు.
నిర్లక్ష్యం ప్రాణాంతకం కావచ్చు!
వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇలాంటి తప్పుడు రిపోర్టులు కేవలం క్లరికల్ తప్పులు మాత్రమే కాదు. వీటి ఆధారంగా తప్పుడు చికిత్స అందిస్తే రోగి ప్రాణాలకే ముప్పు కలగవచ్చు. అల్ట్రాసౌండ్ సోనోగ్రఫీ వంటి కీలక పరీక్షల్లో ఇంతటి నిర్లక్ష్యం వహించడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications