వైద్య చరిత్రలో ఘోరం: నెలన్నర పసిబిడ్డ వేలిని కత్తిరించిన నర్సు!
మధ్యప్రదేశ్లోని ఇండోర్లో అత్యంత బాధాకరమైన, నిర్లక్ష్యపూరితమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నెలన్నర వయసున్న పసికందు వేలిని ఓ నర్సు ప్రమాదవశాత్తు కత్తిరించింది. మహారాజా యశ్వంతరావు ఆస్పత్రిలో బుధవారం జరిగిన ఈ ఘటమ స్థానికంగా కలకలం రేపింది.
అసలేం జరిగింది?
ఇండోర్ సమీపంలోని బెట్మాకు చెందిన అంజుబాయి అనే మహిళ తన నెలన్నర బాబుకు న్యుమోనియా సోకడంతో డిసెంబర్ 24న ఈ ఆస్పత్రిలో చేర్పించారు. బుధవారం బాబు చేతికి ఉన్న ఐవీ క్యాన్యులా వాద్ద వాపు రావడంతో పట్టిని తొలగించడానికి నర్సును పిలిచారు. నర్సు ఆర్తి శ్రోత్రియ క్యాన్యులా పట్టిని కత్తెరతో తొలగిస్తున్న సమయంలో అజాగ్రత్తగా పసికందు బొటనవేలిని కూడా కత్తిరించింది.

వెంటనే స్పందించిన వైద్యులు
వేలు తెగిపోవడంతో బాబు తీవ్ర రక్తస్రావంతో విలవిలలాడాడు. దీంతో భయాందోళనకు గురైన కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. వెంటనే స్పందించిన ఆస్పత్రి యాజమాన్యం, బాబును ఇండోర్లోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించింది. అక్కడ ప్లాస్టిక్ సర్జన్ల బృందం అత్యవసరంగా శస్త్రచికిత్స నిర్వహించి, తెగిపోయిన బొటనవేలిని తిరిగి విజయవంతంగా అతికించారు. ప్రస్తుతం బాబు ఆరోగ్యం స్థిరంగా ఉందని, పర్యవేక్షణలో ఉన్నాడని వైద్యులు తెలిపారు.
నర్సు సస్పెన్షన్.. విచారణకు ఆదేశం
ఈ దారుణ నిర్లక్ష్యంపై ఆసుపత్రి డీన్ డాక్టర్ అరవింద్ ఘంఘోరియా కఠిన చర్యలు తీసుకున్నారు. బాధ్యురాలైన నర్సింగ్ ఆఫీసర్ ఆర్తి శ్రోత్రియను వెంటనే సస్పెండ్ చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన ముగ్గురు నర్సింగ్ ఇంఛార్జ్ల ఒక నెల జీతాన్ని నిలిపివేశారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అశోక్ యాదవ్ నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ త్వరలోనే ప్రభుత్వానికి పూర్తి నివేదిక సమర్పించనుంది.












Click it and Unblock the Notifications