పీడీపీకి 6, బీజేపీకి 8... ఈ నెల 31న గవర్నర్ను కలవనున్న ముఫ్తీ
న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్లో ప్రభుత్వ ఏర్పాటుకు పీడీపీ అధ్యక్షురాలు మొహబూబా ముఫ్తీ రంగం సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా డిసెంబర్ 31న ఆ రాష్ట్ర గవర్నర్ ఎన్ఎన్ వోహ్రాను కలవనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుపై ఆయనతో చర్చించనున్నారు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో పీడీపీ 28 సీట్లు గెలుచుకుని జమ్మూ కాశ్మీర్లో అతి పెద్ద పార్టీగా అవతరించింది. పూర్తి మెజారిటీ రానప్పటికీ, 25 సీట్లు సాధించి రెండో స్ధానంలో నిలిచిన బీజేపీతో పొత్తు పెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.
ఈ మేరకు రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరిందని, ముఖ్యమంత్రిగా ముఫ్తీ ప్రభుత్వం ఏర్పాటు చేయనుండగా, భారతీయ జనతా పార్టీకి చెందిన సభ్యుడికి ఉప ముఖ్యమంత్రి పదవి లభించనుంది. అలాగే ముఫ్తీ కేబినెట్లో పీడీపీకి ఆరు, బీజేపీకి ఎనిమిది మంత్రి పదవులు తొలి విడతగా లభించనున్నాయి.
ఇటీవల జరిగన అసెంబ్లీ ఎన్నికల్లో పీడీపీ 28, బీజేపీ 25, నేషనల్ కాన్ఫరెన్స్ 15, కాంగ్రెస్ పార్టీ 12 స్థానాలు గెలుచుకుంది. మేజిక్ ఫిగర్ (44) స్థానాలు ఏ పార్టీకి రాకపోవడంతో పార్టీల మధ్య చర్చోపచర్చలు సాగాయి. చివరకు పీడీపీ - బీజేపీ పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాయి.