మెము ఎక్స్ప్రెస్ రైళ్లు శాశ్వతంగా రద్దు
బెంగళూరు: నైరుతి రైల్వే ప్రధాన కార్యాలయం కొనసాగుతున్న బెంగళూరును కేంద్రంగా చేసుకుని శివార్లలోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం, దేవనహళ్లి మధ్య రాకపోకలు సాగిస్తోన్న మెము ఎక్స్ప్రెస్ రైలు సర్వీసులన్నీ రద్దయ్యాయి. గురువారం నుంచి ఒక్క మెము కూడా పట్టాలెక్కలేదు. వాటన్నింటినీ రద్దు చేసినట్లు నైరుతి రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.
ప్రయాణికుల సౌకర్యం కోసం బెంగళూరులోని క్రాంతివీర సంగోళి రాయన్న బెంగళూరు సిటీ, బెంగళూరు కంటోన్మెంట్, యలహంక రైల్వే స్టేషన్ల నుంచి అంతర్జాతీయ విమానాశ్రయం, దేవనహళ్లికి ఇదివరకు నైరుతి రైల్వే అధికారులు మెము రైలు సర్వీసులను నడిపించే వారు. విమానాశ్రయానికి వెళ్లే వారికి ఆయా సర్వీసులు సౌకర్యవంతంగా ఉండేవి. వాటన్నింటినీ అధికారులు శాశ్వతంగా రద్దు చేశారు.

ప్రయాణికుల నుంచి ఆదరణ రోజురోజుకూ తగ్గిపోతూ వస్తోండటం వల్ల ఈ నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చిందని వివరించారు. ఆక్యుపెన్సీ రేషియో అయిదు శాతం కూడా ఉండట్లేదని అన్నారు. నిర్వహణ వ్యయం భారీగా పెరిగిపోతోండటం వల్ల రద్దు చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. దీనిపై ప్రయాణికుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమౌతోన్నాయి. సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలు, అభ్యంతరాలను రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్తోన్నారు.
రద్దయిన మెము జాబితాలో 06531 కేఎస్ఆర్ బెంగళూరు- దేవనహళ్లి, 06533 దేవనహళ్లి-యలహంక, 16543 యలహంక-కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రైల్వే స్టేషన్, 06535 దేవనహళ్లి-బెంగళూరు కంటోన్మెంట్, 06536 బెంగళూరు కంటోన్మెంట్- దేవనహళ్లి, 06537 దేవనహళ్లి- బెంగళూరు కంటోన్మెంట్, 06538 బెంగళూరు కంటోన్మెంట్- దేవనహళ్లి, 06539 దేవనహళ్లి- యలహంక, 06540 యలహంక- దేవనహళ్లి, 06532 దేవనహళ్లి- కేఎస్ఆర్ బెంగళూరు ఉన్నాయి.

అధికారులు తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ప్రయాణికులు అభ్యంతరాలను వ్యక్తం చేస్తోన్నారు. ఇప్పటికే ప్యాసింజర్ రైళ్ల రద్దయ్యాయి. ఇప్పుడే అదే జాబితాలో మెము సర్వీసులను కూడా చేర్చడం ఏ మాత్రం సరికాదని చెబుతున్నారు. ఇదే పరిస్థితి మున్ముందు కొనసాగితే పేదలు, మధ్య తరగతి కుటుంబీకులు రైలు ప్రయాణాలకు దూరం అవుతారని, వారికి మరింత భారమౌతుందని తేల్చి చెబుతున్నారు. రైలు ప్రయాణం అనేది ఇక కాస్ట్లీ వ్యవహారమౌతుందని మండిపడుతున్నారు.












Click it and Unblock the Notifications