బీజేపీలోకి మెట్రోమ్యాన్!: కేరళ కాషాయ పార్టీకి బూస్ట్, శ్రీధరన్ ఏమన్నారంటే..?
న్యూఢిల్లీ/తిరువనంతపురం: భారత మెట్రోమ్యాన్గా ప్రసిద్ధి చెందిన ప్రముఖ ఇంజినీర్ శ్రీధరన్ త్వరలోనే రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నారు. తమ పార్టీలో శ్రీధరన్ చేరబోతున్నారని భారతీయ జనతా పార్టీ కేరళ విభాగం తాజాగా ప్రకటించింది. త్వరలో కేరళలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న దరుణంలో శ్రీధరన్ బీజేపీలో చేరడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

21న బీజేపీలోకి శ్రీధరన్..
వచ్చే ఆదివారం(ఫిబ్రవరి 21న) కేరళలో నిర్వహిస్తున్న బీజేపీ విజయ్ యాత్ర సందర్భంగా శ్రీధరన్ బీజేపీలో చేరనున్నట్లు తెలిసింది. 88ఏళ్ల ఈ మెట్రో మ్యాన్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయనను ఎన్నికల్లో పోటీ చేయాలని కోరుతున్నామని కూడా బీజేపీ నేతలు తెలిపారు.

బీజేపీ టికెట్పై పోటీ చేస్తానంటూ శ్రీధరన్ ప్రకనట
ఇది ఇలావుంటే, బీజేపీలో చేరే విషయంపై శ్రీధరన్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీ కోరితే తాను ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమేనని ఆయన స్పష్టం చేశారు. కాగా, దేశంలో మెట్రో రైళ్లకు రూపకల్పన చేసిన ఘనత శ్రీధరన్కు ఉంది. అందుకే ఆయనను భారత మెట్రో మ్యాన్గా పిలుస్తారు. కాగా, 2011లో ఢిల్లీ మెట్రో నుంచి పదవీ విరమణ పొందారు. అసాధ్యమనుకున్న కొంకన్ రైల్వే ప్రాజెక్టును అత్యంత చాకచక్యంగా పూర్తిచేసి, తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నారు శ్రీధరన్. దేశంలో తొలి మెట్రో రైలు ప్రాజెక్టును శ్రీధరన్ విజయవంతంగా పూర్తి చేశారు.

బీజేపీలో చేరి.. అనుభవాన్ని ఉపయోగిస్తానంటున్న శ్రీధరన్
తాను బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నాను, ఇక అధికారిక ప్రక్రియ మాత్రమే మిగిలి ఉందని శ్రీధరన్ పేర్కొనడం గమనార్హం. తాను పదవీ విరమణ తర్వాత గత పదేళ్లుగా కేరళలోనే నివసిస్తున్నట్లు చెప్పిన ఆయన.. వివిధ ప్రభుత్వాల పనితీరును చూసినట్లు తెలిపారు. అయితే, ఏ ప్రభుత్వాలు కూడా ప్రజలకు అవసరమైన పనులు చేయలేదన్నారు. తాను ఇప్పుడు బీజేపీలో చేరి తన అనుభవాన్ని ఉపయోగించుకుంటానని శ్రీధరన్ స్పష్టం చేశారు.

కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు దేశానికి చెడ్డపేరు తెస్తున్నాయంటూ ఫైర్
అంతేగాక, ఇతర పార్టీలపై తీవ్రంగా మండిపడ్డారు. దేశాన్ని చెడుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. స్వార్థ ప్రయోజనాలతో కూడిన రాజకీయ పార్టీలు జాతీయంగా చాలా చెడును చిత్రీకరిస్తున్నాయని, కాంగ్రెస్ వంటి పార్టీలో దేశానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నాయని ధ్వజమెత్తారు. కాగా, శ్రీధరన్ చేరికతో కేరళ బీజేపీ మరింత బలపడుతుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో మెరుగైన ప్రదర్శన కనబర్చిన బీజేపీ.. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారించింది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ కూడా పలు కీలక అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్రంలో ప్రారంభించారు.












Click it and Unblock the Notifications