ఎదురెదురుగా వచ్చిన ఇండిగో, బీఎస్ఎఫ్ విమానాలు... త్రుటిలో తప్పిన పెను ప్రమాదం!
పెను ప్రమాదం త్రుటిలో తప్పిపోయింది. ఆ కాసేపూ ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ. వెంట్రుక వాసిలో ప్రమాదం తప్పిపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఇండిగో ఎయిర్ లైన్స్ విమానం, బీఎస్ఎఫ్ ఎయిర్ క్రాఫ్ట్ ఆకాశంలో ఎద
న్యూఢిల్లీ: ఆ కాసేపు టెన్షన్.. టెన్షన్! రెండు విమానాలు ఎదురెదురుగా వచ్చాయి. ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ. మొత్తానికి పెను ప్రమాదం త్రుటిలో తప్పిపోయింది. వివరాల్లోకి వెళ్తే....
ఇండిగో ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం శుక్రవారం ప్రయాణికులతో శ్రీనగర్ నుంచి ఢిల్లీకి వస్తోంది. అదే సమయంలో, అదే మార్గంలో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్) కు చెందిన ఎయిర్ క్రాఫ్ట్ ఎదురుగా వస్తోంది.
బీఎస్ఎఫ్ ఎయిర్ క్రాఫ్ట్ లో కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్ మెరిషీ కూడా ఉన్నారు. ఇండిగో విమానం 26 వేల అడుగుల ఎత్తులో ఎగురుతోంది. 25 వేల అడుగుల ఎత్తులో ఎగురుతున్న బీఎస్ఎఫ్ ఎయిర్ క్రాఫ్ట్ ఉన్నట్లుండి మరింతపైకి రావడం ప్రారంభించింది.
క్షణాల్లోనే రెండు విమానాలు కనుచూపు దూరంలోకి వచ్చేశాయి. ప్రమాదాన్ని గుర్తించిన ఇండిగో ఎయిర్ లైన్స్ పైలట్ ఏటీసీని సంప్రదించాడు. వెంటనే బీఎస్ఎఫ్ విమానానికి ప్రమాద సంకేతం పంపారు. దీంతో ఆ విమాన పైలట్ కూడా అప్రమత్తమయ్యాయి.
అయినా అప్పటికే పరిస్థితి చేయిదాటి పోయింది. రెండు విమానాలు అతి సమీపం నుంచి దూసుకెళ్లాయి. వెంట్రుక వాసిలో ఆ విధంగా రెండు విమానాలకు పెను ప్రమాదం తప్పింది. దీనిని ఇండిగో అధికార ప్రతినిధులు కూడా ధ్రువీకరించారు. ప్రయాణికులంతా బతుకు జీవుడా అని నిట్టూర్చారు.