హోం నుంచి మైనర్ల పరారీ: మహిళ హత్య, దోపిడీ
నిందితులు మహేష్ గుప్తా అలియాస్ సన్నీ(24), అజయ్ రాయ్(35), నర్సింగ్ కుమార్ వర్మ(35)లతోపాటు జువైనల్ హోం నుంచి తప్పించుకున్న ఇద్దరు మైనర్లను ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు సోమవారం వెల్లడించారు. నిందితులలో మహేష్ గుప్తా పేరు మోసిన దొంగ అని, అతనికి జువెల్లర్గా పనిచేస్తున్న నర్సింగ్ ఈ దొంగతనానికి సాయం చేసినట్లు పోలీసులు తెలిపారు.
రెండు బైకులు, రెండు తుపాకులు, నాలుగు క్యాట్రిడ్జులతోపాటు సుమారు రూ. 25 లక్షల విలువైన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ దొంగతనంలో జువైనల్ హోంకు చెందిన మరో ముగ్గురు మైనర్ల పాత్ర కూడా ఉందని పోలీసులు చెప్పారు. నవంబర్ 7వ తేదీని ఈ దొంగతనం, హత్య జరిగిందని పోలీసులు తెలిపారు. వెండి ఆభరణాల వ్యాపారం నిర్వహించే అజయ్ గుప్తా ఇంట్లో లేని సమయంలో నిందితులు అతని ఇంట్లోకి ప్రవేశించి అతని భార్య మధుబాలను హత్య చేసి 50 కిలో వెండిని అపహరించుకుపోయారు.
తమ తల్లిని హత్య చేయడంతో అక్కడే ఉన్న చిన్నారులు కేకలు వేశారు. స్థానికులు అక్కడికి చేరుకునే లోపే నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అశోక్ నగర్లో కేబుల్ ఆపరేట్గా సన్నీ పేరుతో విధులు నిర్వహిస్తున్న ప్రధాన నిందితుడైన మహేష్ గుప్తాను పోలీసులు అరెస్ట్ చేసి విచారించడంతో మిగితా నిందితుల వివరాలను తెలిపాడు. దీంతో పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు.