ఏపీకి ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీస్-కేంద్రం ఆమోదం-ఇక ఉద్యోగాల జాతరే..!!
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర కేబినెట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గుడ్ న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా 12 నూతన ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీస్కు ఆమోదం తెలిపింది. ఇందులో రెండిటిని ఆంధ్రప్రదేశ్కు ప్రకటించింది. ఇక మొత్తం 12 ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీస్ అభివృద్ధి కోసం రూ.28,602 కోట్లను ఖర్చు చేయనుంది. ఈ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీస్ ద్వారా స్థానిక తయారీ సంస్థకు ఊతమివ్వాలని యోచిస్తున్నట్లు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.
తయారీ రంగ సంస్థలను అభివృద్ధి చేసేందుకు ప్లగ్ అండ్ ప్లే ఇండస్ట్రియల్ పార్కులను 100 నగరాల్లో ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం బడ్జెట్ సమావేశాల్లో ప్రకటించింది. ఇది ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, మరియు ప్రైవేట్ సంస్థలతో భాగస్వామిగా ఏర్పాటై ముందుకు వెళ్లేలా ప్రణాళిక సిద్ధం చేసింది.కేంద్రం విజన్లో భాగంగా ఉన్న వికసిత్ భారత్ కింద ఈ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీస్ను ఏర్పాటు చేయనుంది.

ఇక ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీస్ ఏర్పాటుతో తయారీ రంగంలో దేశ రూపు రేఖలు మారబోతున్నాయని మంత్రి వెల్లడించారు.
- మొత్తం 12 ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీస్ కోసం రూ.28,602 కోట్లు ఖర్చు చేస్తున్నందున భారత పారిశ్రామిక ముఖచిత్రం మారబోతోంది
- ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీస్ ఏర్పాటుతో ప్రత్యక్షంగా 10 లక్షలు, పరోక్షంగా 30 లక్షల ఉద్యోగాలు వస్తాయి
- దాదాపుగా రూ.1.5 లక్షల కోట్లు పెట్టుబడుల సామర్థ్యం
- ప్రధానమంత్రి గతిశక్తి విధానాలపై ప్రాజెక్టు ఏర్పాటు
- ప్రణాళిక బద్దంగా జరిగే పట్టణీకీకరణతో ప్లగ్ అండ్ ప్లే అమల్లోకి వస్తుంది. దీంతో వాక్-టు-వర్క్ కాన్సెప్ట్ అందుబాటులోకి వస్తుంది
- దీర్ఘకాల మన్నికగల వనరులు అందుబాటులోకి వస్తే పెట్టుబడులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో ప్రాంతం అభివృద్ధి బాటలో నడుస్తుంది.
- ఇన్వెస్టర్స్ పెట్టుబడి పెడితే భూమి కేటాయింపుల నుంచి అన్ని అవసరాలను పరిష్కరిస్తుంది
ఇదిలా ఉంటే ఇప్పటికే ప్రతిపాదించిన 12 నగరాల్లో 8 నగరాలు వివిధ దశల్లో ఉన్నాయని డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ తెలిపారు. ఢోలేరా (గుజరాత్), ఔరిక్ (మహారాష్ట్ర), విక్రమ్ ఉద్యోగ్ పురి (మధ్యప్రదేశ్),కృష్ణపట్నం (ఆంధ్రప్రదేశ్)లాంటి నాలుగు నగరాల్లో ఇప్పటికే ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కేటాయించినట్లు చెప్పారు. ఇక ఇండస్ట్రీల కోసం భూములు కేటాయించే పనులు జరుగుతున్నాయని వెల్లడించారు.
మిగతా నాలుగు నగరాల్లో కనీస వసతులు అయిన రోడ్ కనెక్టివిటీ, నీరు, విద్యుత్లను అందించే ప్రక్రియ వేగవంతంగా జరుగుతోందని కార్యదర్శి రాజేష్ కుమార్ చెప్పారు.ఇప్పటికే 8 నగరాల్లో పనులు వేగవంతం కాగా కొత్తగా 12 నగరాలు చేర్చడంతో ఇండస్ట్రీస్ స్మార్ట్ సిటీస్ సంఖ్య 20కి చేరింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో తయారీ రంగంలో దేశ స్థూలదేశీయోత్పత్తి పెరగడమే కాకుండా ఉద్యోగ కల్పన కూడా పెరుగుతుందని కేంద్రమంత్రి అశ్వనీ వైష్ణవ్ వివరించారు.












Click it and Unblock the Notifications