అన్నదాతలకు మోడీ సర్కారు న్యూఇయర్ గిఫ్ట్
కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అన్నదాతలకు శుభవార్త అందించింది. పంటల బీమా పథకమైన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY)ను మరింతగా పెంచాలని నిర్ణయించారు. ఈ పథకం రైతుల జీవితాల్లో గణనీయమైన మార్పు తెచ్చిందని కేంద్రం పేర్కొంది. బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో దీంతోపాటు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ప్రధానమంత్రి ఫసల్ బీమా బీమా యోజన కేటాయింపులను రూ. 69,515 కోట్లకు పెంచుతూ ఆమోదం తెలిపింది. దీంతో రైతుల పంటలకు మరింత రక్షణ లభించడంతోపాటు నష్టాల పట్ల ఆందోళన తగ్గనుంది. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో నిర్వహించిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు.

అలాగే, 50 కిలోల డీఏపీ ఎరువుల బస్తాను రూ. 1350 చొప్పున రైతులకు అందజేసేందుకు రూ. 3850 కోట్ల ప్రత్యేక ప్యాకేజీని పొడిగిస్తున్నట్లు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. 2025లో తొలి కేబినెట్ భేటీని ప్రధాని మోడీ రైతులకు అంకిత చేశారని చెప్పారు. రెండు పంటల బీమా పథకాలకు పీఎంఎఫ్బీవై, రీస్ట్రక్చర్డ్ వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్(RWBCIS) పథకాలను కేంద్రం 2025-26 వరకు పొడిగించినట్లు కేంద్రమంత్రి వెల్లడించారు. వీటిని 15వ ఆర్థిక సంఘం కాలానుగుణంగా పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
పీఎంఎఫ్బీవై, ఆర్డబ్ల్యూబీసీఐ పథకాలకు కేటాయింపులను రూ. 69,515.71 కోట్లకు పెంచారు. ఈ పంటల బీమా పథకాల అమలులో సాంకేతికతను వినియోగించుకునేందుకు రూ. 824.77 కోట్ల కార్పస్తో ప్రత్యేక నిధి ఏర్పాటుకు కేంద్రమంత్రివర్గం ఆమోదం తెలిపిందని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఈ టెక్నాలజీ వినియోగంతో పంట నష్టం అంచనాలను త్వరగా తెలుసుకోవడంతోపాటు క్లెయిమ్ సెటిల్మెంట్, వివాదాలకు తగ్గించేందుకు సహాయ పడుతుందన్నారు.
మరోవైపు, కేబినెట్ నిర్ణయాలపై ప్రధాని మోడీ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. 'రైతుల సంక్షేమానికి పూర్తిగా కట్టుబడి ఉన్న ప్రభుత్వ మాది. దేశానికి అన్నం పెట్టేందుకు శ్రమించే మన రైతులు గర్వకారణం. 205 మొదటి కేబినెట్ భేటీని రైతుల శ్రేయస్సు కోసం అంకితం చేశాం. వారి విషయంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నందుకు ఆనందంగా ఉంది' అని ఎక్స్ వేదికగా ప్రధాని మోడీ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications