ప్రతిపక్షాల ఆశలు అడియాసలు చేసిన శివసేన ..? మళ్లీ మోదీ అధికారంలోకి వస్తారని ధీమా
ముంబై : లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ నరేంద్రమోదీ సర్కార్ పై ఉన్న వ్యతిరేకత క్రమంగా తగ్గినట్టే కనిపిస్తోంది. బడ్జెట్ సమావేశాల ముగింపు సందర్భంగా నేతాజీ ములాయం సింగ్ యాదవ్ మళ్లీ మోదీ ప్రధాని కావాలని మనసులో మాట బయటపెట్టిన తరుణంలో .. ఎన్డీఏ భాగస్వామ్య పక్షం శివసేన కూడా అదే స్వరం వినిపించింది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారం చేపట్టాలని ఆకాంక్షించింది.
మోదీకి శివసేన మద్దతు
వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేసింది శివసేన. దేశ ప్రయోజనాల కోసం మోదీ సర్కార్ మంచి పనులు చేసిందని కొనియాడింది. ఈ నాలుగున్నరేళ్లలో మోదీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు .. సంస్కరణలతో దేశం పురోగమన దిశలో పయనించిందని కీర్తించింది. బుధవారం లోక్ సభలో శివసేన ఎంపీ ఆనంద్ రావు అడ్సుల్ .. మోదీ సర్కార్ చేసిన మంచి పనులను కీర్తించారు. ఆనంద్ వ్యాఖ్యలతో సభలో ఉన్న బీజేపీ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ .. బల్ల చరిచి మద్దతు తెలిపారు. ఇటు ములాయం .. అటు ఆనంద్ రావు చేసిన వ్యాఖ్యలతో బీజేపీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపింది. వచ్చే ఎన్నికల కోసం పార్టీ కార్యకర్తలు సైనికులుగా కష్టపడాలని పార్టీ నేతలు పిలుపునిచ్చారు.
బీజేపీతోనే ముందుకు ...
ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయం పాలైంది. గత సార్వత్రిక ఎన్నికల నుంచి కొనసాగిన బీజేపీ జైత్రయాత్రకు సెమీ ఫైనల్ గా భావించే 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మింగుడుపడలేదు. 3 రాష్ట్రాల్లో బీజేపీ అధికారం కోల్పోయి .. విపక్షానికే పరిమితమైంది. ఈ క్రమంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షం శివసేన బీజేపీపై ఎదురుదాడికి కూడా దిగింది. దీంతో వచ్చే ఎన్నికల్లో శివసేన ఒంటరిగా బరిలోకి దిగుతోందా అనే ప్రశ్న తలెత్తింది. ఈ సమయంలో బుధవారం లోక్ సభలో శివసేన నేత ఆనంద్ రావు చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. దీంతో తమ భాగస్వామ్య పక్షం బీజేపీతోనే కలిసి ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమనే సంకేతాలను ఇచ్చినట్లైంది.
ఎల్జేపీ కూడా మద్దతు ..
నరేంద్రమోదీకి ములాయం, ఆనంద్ తోపాటు లోక్ జనశక్తి పార్టీ కూడా మద్దతు తెలిపింది. కేంద్ర క్యాబినెట్ లో కొనసాగుతున్న ఎల్జేపీ అధినేత, కేంద్రమంత్రి రాం విలాస్ పాశ్వాన్ కూడా మోదీ తిరిగి ప్రధాని అవుతారన్నారు. మోదీ హయాంలో జరిగిన సంక్షేమ కార్యక్రమాలు ఏ ప్రభుత్వం చేయలేదని .. ఎన్డీఏ సర్కార్ చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకుందని ఆయన కొనియాడారు. బీహార్ కు చెందిన పాశ్వాన్ .. దళిత నేత. ఇదివరకు లాలూ ప్రసాద్ యాదవత్ తో కూడా పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీచేశారు. తాజాగా మోదీ ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా కొనసాగుతున్నారు. తమ క్యాబినెట్ సహచరుడు మోదీపై ప్రశంసలు కురిపించడం పట్ల తమ విజయం నల్లేరుపై నడకేనని బీజేపీ శ్రేణులు భావిస్తున్నాయి.
స్పీకర్ కు ప్రశంసలు
ప్రధాని మోదీతోపాటు స్పీకర్ సుమిత్రా మహాజన్ ను కూడా నేతలు ప్రశంసిస్తున్నారు. 16వ లోక్ సభను సుమిత్రా సమర్ధవంతంగా నడిపారని ప్రశంసించారు. ఆమె సభను నడిపిన తీరు సర్వదా అభినందనీయమని బీజేడీ, టీఎంసీ, ఇతర పార్టీల నేతలు కొనియాడారు. ఇటు కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ.. ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ తన పాత్రను సమర్ధంగా ఫోషించిందన్నారు.