ఏపీలోకి ప్రవేశించిన రుతుపవనాలు: దేశంలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు
న్యూఢిల్లీ/విశాఖపట్నం: భారతదేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సోమవారం హెచ్చరికలు జారీ చేసింది. పశ్చిమ బెంగాల్, ఒడిశా, జార్ఖండ్, బీహార్, యూపీ, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, చత్తీస్గఢ్, విదర్బ, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, కోస్టల్ ఆంధ్రప్రదేశ్ తదితరచోట్ల కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, భారీగా గాలివీచి, మెరుపులతో కూడిన వర్షాలు వచ్చే అవకాశముందని తెలిపింది.
అండమాన్-నికోబర్, అస్సోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర, కేరళలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.
ఉత్తర భారత దేశం, మధ్య భారత్లో వాతావరణం వేడిగా ఉంటుందని పేర్కొన్నారు. వాతావరణ శాఖ ప్రకారం ఈ మాన్సూన్ సమయంలో మధ్య భారత్లో సాధారణ వర్షపాతం ఉంటుంది. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలలో సాధారణం కంటే దిగువన నార్త్ - ఈస్ట్లో అంతకంటే తక్కువ వర్షపాతం ఉంటుంది.
లాంగ్ పీరియడ్ యావరేజ్ (ఎల్పీఏ) సగటుతో పోల్చుకుంటే జూలై నెలలో 101% వర్షపాతం ఉండే అవకాశముంది. ఆగస్టులో 94% వర్షపాతానికి అవకాశముంది. 90%- 96% వర్షపాతాన్ని సాధారణం కంటే తక్కువ వర్షపాతంగా, 96%-104% మధ్య కురిస్తే సాధారణ వర్షపాతంగా చెప్పవచ్చు. 90% కంటే తక్కువగా ఉంటే వర్షభావ పరిస్థితిగా, 104%-110% మధ్య వర్షపాతం ఉంటే అత్యధిక వర్షంగా పరిగణిస్తారు.
ఏపీలో ప్రవేశించిన నైరుతి
నైరుతి రుతుపవనాలు ఏపీలో ప్రవేశించాయి. సోమవారం అనంతపురం జిల్లా మీదుగా రాష్ట్రంలోకి ప్రవేశించినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే కర్ణాటక, తమిళనాడులోని చాలా ప్రాంతాలకు విస్తరించిన రుతుపవనాలు రెండు రోజుల్లో రాయలసీమ, మహారాష్ట్ర ప్రాంతాలకు పూర్తిగా విస్తరిస్తాయని తెలిపింది.
ఏపీలోని చాలా ప్రాంతాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. క్యుములోనింబస్ మేఘాల వల్ల ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంటుందని తెలిపారు.