ఐదు రూపాయల చోరీకి కుమారుడికి నిప్పంటించిన కసాయి తల్లి
రాజస్థాన్: కుటుంబ సభ్యులకు తెలియకుండా రూ. 5 చోరి చేసిన బాలుడు కాలినగాయాలతో ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు. కన్నబిడ్డ మీద కనికరం లేకుండా కేవలం డబ్బు ముఖం చూసిన తల్లిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.
రాజస్థాన్ లోని బికనీర్ ప్రాంతంలో రుక్సానా అనే మహిళ నివాసం ఉంటున్నది. ఈమెకు షహిల్ (6) అనే కుమారుడు ఉన్నాడు. మంగళవారం షహిల్ తల్లికి తెలియకుండా పెట్టెలో ఉన్న చిల్లర తీసుకుని బేకరిలో బిస్కెట్లు తీసుకోవాలని అనుకున్నాడు.
ఆ ఆలోచనతో పెట్టెలో నుండి రూ. 5 చోరీ చేశాడు. అదే సమయంలో రుక్సానా విషయం గుర్తించింది. వెంటనే ఇంటిలో ఉన్న కిరోసిన్ తీసుకుని కుమారుడు షహిల్ మీద చల్లి నిప్పంటించింది. విషయం గుర్తించిన కుటుంబ సభ్యులు షహిల్ ను పీబీఎం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
బాలుడు చికిత్స పొందుతున్నాడని, అతని పరిస్థితి విషమంగా ఉందని నయషహర్ పోలీసులు అన్నారు. చోరీ చేసినందుకే తన కుమారుడికి నిప్పంటించానని రుక్సానా అంగీకరించిందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.