MSRTC: ఆర్టీసీ ఛార్జీలు పెంపు,అర్ధరాత్రి నుంచే భారీగా పెరిగిన టికెట్ రేట్లు
నిత్యం బస్సుల్లో ప్రయాణించే సామాన్య, మధ్యతరగతి ప్రజలకు మహారాష్ట్ర రవాణా శాఖ గట్టి షాక్ ఇచ్చింది. మహారాష్ట్ర స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (MSRTC) బస్సు ఛార్జీలను భారీగా పెంచుతూ రాష్ట్ర రవాణా అథారిటీ సంచలన నిర్ణయం తీసుకుంది. దాదాపు 13.56 శాతం మేర టికెట్ ధరలను పెంచుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
గల్ఫ్ దేశాలలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల వల్ల డీజిల్ ధరలు మండిపోతుండటం, స్పేర్ పార్ట్స్, టైర్ల ఖర్చులు పెరగడంతో పాటు ఆర్టీసీ ఉద్యోగుల అలవెన్సులు కూడా ఎక్కువ కావడంతో ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని అధికారులు స్పష్టం చేశారు. పెరిగిన ఈ కొత్త ఛార్జీలు జూలై 17, జూలై 18 మధ్య వచ్చే అర్ధరాత్రి నుంచే అమలులోకి వచ్చాయి.

ఏ బస్సుకు ఎంత పెరిగిందంటే..?
ప్రయాణికులపై భారం పడకుండా సాధారణ బస్సులకు మాత్రమే 13.56 శాతం మేర ధరలను పెంచినట్లు ఆర్టీసీ వర్గాలు తెలిపాయి. మిగిలిన లగ్జరీ, ఏసీ సర్వీసులకు వేర్వేరుగా ధరలను సవరించారు. కొత్త నిబంధనల ప్రకారం..
- ఆర్డినరీ బస్సులకు ప్రతి స్టేజీకి రూ.11.40
- సెమీ లగ్జరీ బస్సులకు ప్రతి స్టేజీకి రూ.13.65
- ఆర్డినరీ స్లీపర్ కమ్ సీటర్ బస్సులకు రూ.15.50
- పూర్తి స్లీపర్ బస్సులకు రూ.16.75
ప్రీమియం సర్వీసులైన శివశాహి ఏసీ సీటర్, స్లీపర్లకు వరుసగా రూ.14.20, రూ.15.35 గా.. శివనేరి ఏసీ సీటర్, స్లీపర్ బస్సులకు వరుసగా రూ.21.25, రూ.25.35 గా ప్రతి స్టేజీకి ధరలను ఖరారు చేశారు.
ప్రధాన రూట్లలో టికెట్ ధరల మార్పులు ఇవే:
సాధారణంగా నడిచే ప్రధాన నగరాల మధ్య బస్సు ఛార్జీలు రూ.15 నుంచి రూ.25 వరకు పెరిగాయి. ఆయా రూట్లలో మారిన పాత, కొత్త ధరలు ఇలా ఉన్నాయి
- ముంబై నుంచి సతారా: పాత ధర రూ.498 కాగా.. ఇకపై రూ.555 చెల్లించాలి.
- ముంబై నుంచి కొల్హాపూర్: పాత ధర రూ.730 నుంచి రూ.755 కి చేరింది.
- ముంబై నుంచి సోలాపూర్: పాత ధర రూ.705 కాగా.. ఇప్పుడు రూ.800 కి పెరిగింది.
- పుణే నుంచి సోలాపూర్: పాత ధర రూ.454 నుంచి రూ.480 కి పెంచారు.
- నాసిక్ నుంచి పుణే: పాత ధర రూ.410 కాగా.. కొత్త ధర రూ.425 గా మారింది.
గతంలో ఆర్డినరీ బస్సులపై ఉన్న 10 శాతం పండుగ/సీజనల్ అదనపు ఛార్జీలను ఇప్పుడు పూర్తిగా రద్దు చేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది.
చిల్లర కష్టాలకు చెక్.. ఐదు రూపాయల రౌండఫ్!
ఈ ఛార్జీల పెంపులో ప్రయాణికులకు ఒక సానుకూల అంశం కూడా ఉంది. టికెట్ ధరలను లెక్కించేటప్పుడు రూపాయి, రెండు రూపాయల చిల్లర సమస్యలు రాకుండా ఉండేందుకు వీలుగా ధరలను రూ.5 మల్టిపుల్స్కు రౌండప్ చేశారు. దీనివల్ల కండక్టర్లకు, ప్రయాణికులకు మధ్య నిత్యం జరిగే చిల్లర తగాదాలు పూర్తిగా తప్పుతాయని ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు సంతోషం వ్యక్తం చేశాయి.
రోజుకు దాదాపు 55 లక్షల మంది ప్రయాణికులను చేరవేస్తూ, 14 వేలకు పైగా బస్సులతో దేశంలోనే అతిపెద్ద రవాణా సంస్థలలో ఒకటిగా ఉన్న మహారాష్ట్ర ఆర్టీసీని ఆర్థిక నష్టాల నుంచి గట్టెక్కించడానికే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు రవాణా శాఖ మంత్రి ప్రతాప్ సర్నాయక్ సమర్థించుకున్నారు.














Click it and Unblock the Notifications