‘అమ్మ గొంతుకోసి, నాన్న ఆత్మహత్య చేసుకున్నాడు’
ముంబై: మహారాష్ట్రలోని ముంబైలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన భార్య గొంతుకోసి, తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా, ఈ ఘోరమంతా వారి కూతురు చూసి దిగ్భ్రాంతికి గురైంది. ఈ రెండు మరణాలకు అక్రమ సంబంధమే కారణమని పోలీసులు భావిస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. నితిన్ పుండ్కర్(37), సురేఖ అనే దంపతులకు 2007లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు సమీక్ష(9), యువరాజ్(7). సోమ, మంగళవారం తీవ్రంగా గొడవపడిన అనంతరం ఆవేశంలో నితిన్ తన భార్య సురేఖ గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదంతా చూసిన సమీక్ష దిగ్ర్భాంతికి గురై కన్నీరుమున్నీరుగా విలపించింది.
తల్లి హత్యను, నాన్న ఉరేసుకున్న విధానాన్ని కన్నీటిపర్యాంతమవుతూ వివరించింది సమీక్ష. ‘సోమవారం అర్ధరాత్రి నేను నిద్రపోతున్నాను. మధ్య రాత్రిలో మెలకువ వచ్చింది. ఆ సమయంలో అమ్మపై నాన్న కూర్చున్నాడు. అమ్మ ముఖంపై దిండు పెట్టి ఊపిరాడకుండా చేశాడు. కిచెన్లో ఉన్న కత్తితో గొంతు కోశాడు' అని తెలిపింది.
‘ఆ తర్వాత నాన్న సీలింగ్ ఫ్యాన్కు ఉరేసుకుని చనిపోయాడు. ఆ సమయంలో ఏం చేయాలో నాకు తోయలేదు. పొద్దున్నే లేచి మా ఇంటికి సమీపంలో ఉన్న బంధువు ఉమా ఆంటీ ఇంటికి వెళ్లి విషయం చెప్పాను' అని సమీక్ష కన్నీటిపర్యాంతమైంది. చిన్నారి ఆవేదన అక్కడున్న ప్రతీ ఒక్కర్నీ కలచివేసింది.
కాగా, నితిన్ వృత్తిరీత్యా సాయి మోటార్ డ్రైవింగ్ స్కూల్లో డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్గా పని చేస్తున్నాడు. ఇక సురేఖ గృహిణి. అయితే సురేఖకు వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే నితిన్, సురేఖ మధ్య గొడవలు జరుగుతుండేవని తెలిసింది. ప్రతి రోజు నితిన్ మద్యం సేవించి సురేఖను కొట్టేవాడని సమాచారం.
అయితే ప్రతి రోజు ఉమా వీరి ఇంటికి వస్తుండేది. సోమవారం రాత్రి కూడా ఉమా సురేఖ ఇంటికి వచ్చింది. ‘ఈ రాత్రి ఇక్కడే ఉండు' అని ఉమాను సురేఖ ప్రాధేయపడింది. ఉమా సురేఖ నివాసంలో ఉండకుండా రాత్రి 11 గంటల వరకు ఉండి వెళ్లిపోయింది. ఉమా వెళ్లిన కొద్ది గంటలకే ఈ ఘోరం జరిగిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.