అమ్మతనానికి మచ్చ: పసికందును పబ్లిక్ టాయిలెట్లో పడేసింది
కన్న పేగును తెంచుకుని పుట్టిందన్న కనికరం కూడా లేకుండా అప్పుడే పుట్టిన పసికందును మరుగుదొడ్డి(పబ్లిక్ టాయిలెట్)లో పడేసి ఆ తల్లి తన కర్కశాన్ని చాటుకుంది.
ముంబై: కన్న పేగును తెంచుకుని పుట్టిందన్న కనికరం కూడా లేకుండా అప్పుడే పుట్టిన పసికందును మరుగుదొడ్డి(పబ్లిక్ టాయిలెట్)లో పడేసి ఆ తల్లి తన కర్కశాన్ని చాటుకుంది. ఆడపిల్లని పడేసిందో లేక తప్పు చేసిన ఫలితామో గానీ కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కన్న తల్లే ఆ చిన్నారిని అంతం చేయాలనుకుంది.
ఈ దారుణ ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబైలో చోటు చేసుకుంది. సదరు మహిళ.. పుట్టిన కొద్ది గంటల్లోనే బిడ్డను మరుగుదొడ్డిలో పడేసి వెళ్లిపోయింది. కొద్దిసేపటి తర్వాత ఓ మహిళ అందులోకి వెళ్లగా మరుగుదొడ్డి రంధ్రంలోంచి పసిబిడ్డ ముఖం కనిపించడంతో ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు.
వెంటనే బయటకు తీసి తన కుటుంబ సభ్యులతో పాటు, పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడకు చేరుకున్న పోలీసులు ఆ పసిపాపను ఆసుపత్రికి తరలించారు.
వైద్యుల చికిత్స అనంతరం చిన్నారి ఆరోగ్యం కుదుటపడగానే పోషణకు గాను వాత్సల్య ట్రస్టుకు అందజేస్తామని సీనియర్ పోలీసు అధికారి అజినాథ్ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, ఆ బిడ్డ తల్లి కోసం గాలింపు చేపట్టినట్లు వెల్లడించారు.