రుతుపవనాల బీభత్సం- ముంబై కకావికలం: మహారాష్ట్ర అంతటా భారీ వర్షాలు
నైరుతి రుతుపవనాల ప్రభావంతో మహారాష్ట్రలో అసాధారణ వర్షాలు కురుస్తోన్నాయి. అతి భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈదురుగాలులు వణికిస్తోన్నాయి. రాత్రంతా ఏకధాటిగా కురిసిన వర్షాల దెబ్బకు అక్కడి జనజీవనం అస్తవ్యస్తమైంది. వాహనాల రాకపోకలు ఎక్కడికక్కడ స్తంభించిపోయాయి. చెట్లు విరిగిపడ్డాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. ముంబై ప్రాణాధారమైన సబర్బన్ రైల్వే నెట్ వర్క్ కకావికలంగా మారింది.
ఒక్క ముంబైలో మాత్రమే కాదు.. పొరుగునే ఉన్న థానె సహా మరో ఎనిమిది జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. వర్షాల తీవ్రత మరో అయిదు రోజుల పాటు ఉంటుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు రెడ్, ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ను సైతం జారీ చేసింది. అత్యవసరమైన పనులు ఉంటే తప్ప ప్రజలు బయటికి వెళ్లొద్దంటూ సూచించింది. నేడు కూడా అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

ముంబైలో నైరుతి రుతుపవనాల ప్రవేశంతో రికార్డు స్థాయిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాత్రంతా కురిసిన కుండపోత వానలకు మహారాష్ట్ర రాజధాని ఒక్కసారిగా స్తంభించిపోయింది. నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమవడంతో రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లపై మోకాల్లోతు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొంటోన్నారు. అవస్థలు పడుతున్నారు.
వర్షాల తీవ్రత రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుండటంతో ముంబైలోని పలు ప్రాంతాల్లో పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. ముఖ్యంగా అత్యంత రద్దీగా ఉండే అంధేరి పరిధిలోని అండర్పాస్ పూర్తిగా నీట మునిగింది. దీంతో ముందస్తు జాగ్రత్త చర్యగా బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఈ మార్గంలో ట్రాఫిక్ను తాత్కాలికంగా నిలిపివేశారు. వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లిస్తున్నారు.
🌧️बृहन्मुंबई महानगरपालिका क्षेत्रात दिनांक २३ जून २०२६ सकाळी ८ ते दिनांक २४ जून २०२६ सकाळी ७ वाजेपर्यंत झालेल्या पावसाची आकडेवारी खालीलप्रमाणे :#MyBMCUpdates #MumbaiRains pic.twitter.com/Aek1u4zOch
— माझी Mumbai, आपली BMC (@mybmc) June 24, 2026
ముంబై సౌత్ లో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఇక్కడ 328 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. దాదర్, నాయర్ హాస్పిటల్, బైకుల్లా, వడాలా, మలబార్ హిల్, వర్లీ, రావ్లీ, పొవై, విహార్ లేక్, విఖ్రోలి, బోరీవలి, ఖండీవలి, జోగేశ్వరి, ఆరే కాలనీ, బాంద్రా, ఠాగూర్ నగర్, మన్ ఖుర్ద్, ఛార్ ఖోప్, మల్వాణి, మలద్.. ఇలా దాదాపు అన్ని ప్రాంతాల్లో కూడా 200 మిల్లీ మీటర్లకు పైగా వర్షపాతం రికార్డయినట్లు బీఎంసీ వివరించింది. దీనికి సంబంధించిన డేటా విడుదల చేసింది.
ఇవే వర్షాల తీవ్రత రాష్ట్రం అంతటా ఉంటుందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. కొంకణ్ రీజియన్ తీర ప్రాంతంలో వర్షాల తీవ్రత విపరీతంగా పెరుగుతుందని అంచనా వేసింది. ఈ క్రమంలో రత్నగిరి జిల్లాకు అత్యంత ప్రమాదకరమైన రెడ్ అలర్ట్ ప్రకటించింది. అలాగే.. సింధుదుర్గ్, రాయ్గఢ్, పూణే ఘాట్ ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. థానే, పాల్ఘర్, సతారా, కొల్హాపూర్, నాసిక్ ఘాట్ ప్రాంతాలకు రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఎల్లో అలర్ట్ ప్రకటించారు.
#WATCH | Maharashtra | Trans-Harbour Railway services have been temporarily suspended due to soil erosion beneath the railway tracks between Koparkhairane and Ghansoli in Navi Mumbai
— ANI (@ANI) June 24, 2026
Repair and restoration work is underway pic.twitter.com/HD0qR8Sgnp
అదేవిధంగా ధారాశివ్, లాతూర్, బీడ్, ఛత్రపతి శంభాజీనగర్ వంటి జిల్లాలకు కూడా ఇదే పరిస్థితి నెలకొంది. విదర్భలోని చాలా జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. అకోలా, అమరావతి జిల్లాల్లో మాత్రం వడగాల్పుల తీవ్రత దృష్ట్యా ప్రత్యేకంగా ఎల్లో అలర్ట్ ఇవ్వడం గమనార్హం. సాధారణంగా జూన్ 10 నాటికే ముంబైని తాకాల్సిన నైరుతి రుతుపవనాలు, ఈ ఏడాది 13 రోజులు ఆలస్యంగా వచ్చాయి. ఈ నెల 23న ముంబైని తాకాయి.












Click it and Unblock the Notifications