పాక్ నటుడు పరార్: పాక్ తారలకు పోలీసు భద్రత
ముంబై: సెప్టెంబర్ 25 లోపు పాకిస్థాన్ కు చెందిన నటీనటులు అందరూ దేశం విడిచి వెళ్లిపోవాలని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎంఎన్ఎస్) అల్టిమేటం జారీచెయ్యడం ప్రకంపనలు సృష్టిస్తున్నది. పాక్ కు చెందిన సినీ, టీవీ నటీనటులు అందరూ హడలిపోతున్నారు.
మహారాష్ట్ర పోలీసులు పాక్ నటీనటులకు భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చినా వారు బయటకురావాలంటే భయపడిపోతున్నారు. పాకిస్థాన్ నటుడు ఫవాద్ ఖాన్ రహస్యంగా దేశం విడిచి వెళ్లిపోయాడు.
ఇప్పట్లో అతనికి భారత్ తిరిగి వచ్చే ఉద్దేశం లేదని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఉరీ ఉగ్రవాద దాడి అనంతరం మహారాష్ట్ర నవ నిర్మాణ సేన 48 గంటల్లో దేశం విడిచిపెట్టి వెళ్లాలని పాక్ నటీనటులను హెచ్చరించింది.
ప్రముఖ దర్శక, నిర్మాత కరోణ్ జోహార్ సినిమాలో ఫవాద్ ఖాన్ నటించాడు. మహారాష్ట్ర నవ నిర్మాణ సేన హెచ్చరించిన తరువాత సినిమా ప్రమోషన్ లో ఫవాద్ ఖాన్ పాల్గొనడని కరణ్ జోహార్ చెప్పారు.
పాక్ తారలను ప్రోత్సహిస్తే పరిస్థితి వేరుగా ఉంటుందని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన ఉపాధ్యక్షురాలు షాలిని థాక్రే నేరుగా కరణ్ జోహార్ ను హెచ్చరించారు. బెదిరింపులు వచ్చిన నేపధ్యంలో పాక్ తారలతో పాటు ప్రముఖ దర్శక, నిర్మాతలకు మహారాష్ట్ర పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.