ముజఫర్నగర్లో పరామర్శ: పిఎం, సోనియా, రాహుల్
ముజఫర్నగర్: ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్, యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సోమవారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్నగర్లో పర్యటించారు. ఇటీవల జరిగిన అల్లర్లలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులను వారు పరామర్శించారు.
అల్లర్ల నేపథ్యంలో స్వగ్రామాలను వదిలి వెళ్లిన ప్రజలకు పునరావాసం కల్పించి, వారి భద్రతకు తగిన చర్యలు చేపట్టాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రధాని మన్మోహన్ సింగ్ కోరారు. బస్సికలన్, తవ్లీ గ్రామాలను ఉన్నతాధికారులతో కలిసి ప్రధాని సందర్శించారు. బాధితులకు సంఘీభావం తెలిపేందుకే సోనియాగాంధీ, రాహుల్ గాంధీతో కలిసి వచ్చినట్లు ప్రధాని తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు.

సెప్టెంబర్ 7 నుంచి జరిగిన ఈ అల్లర్లలో సుమారు 48మంది మరణించారు. 100మందికి పైగా ప్రజలు క్షతగాత్రులయ్యారు. మరో 43వేల మంది ప్రజలు తమ నివాసాలను వదిలి వేరే ప్రాంతాలకు వెళ్లిపోయారు. అల్లర్లను నియంత్రించేందుకు సైన్యం రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అర్లర్లు జరిగిన ప్రాంతాల్లో మరింత భద్రతను పెంచాల్సిన అవసరముందని ప్రధాని మన్మోహన్ సింగ్ తెలిపారు. నివాసాలను వదిలివెళ్లిన ప్రజలకు పునరావాసం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కావాల్సిన అన్ని రకాల సహాయ సహకారాలు కేంద్రం అందిస్తుందని మన్మోహన్ సింగ్ తెలిపారు.
అల్లర్లకు సంబంధించిన వివరాలను సోనియాగాంధీ అక్కడున్న మహిళలను అడిగి తెలుసుకొని వారికి సంఘీభావం ప్రకటించారు. రాహుల్ గాంధీ యువకులనుద్దేశించి మాట్లాడుతూ..కాంగ్రెస్ ప్రభుత్వం మీ వెంటే ఉంటుందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ఘటనకు సంబంధించిన ఫిర్యాదులను ప్రజల నుంచి స్వీకరించి వాటికి పరిష్కారం చూపాలని కేంద్రమంత్రి ఆర్పీఎన్ సింగ్ను కోరారు.
కాగా ఘటన పట్ల జిల్లా యంత్రాంగం గానీ, రాష్ట్ర ప్రభుత్వం గానీ సరైన రీతిలో స్పందించలేదని, తమకు ఎలాంటి సహాయ సహకారాలు ప్రభుత్వం నుంచి అందలేదని స్థానికులు ప్రధాని దృష్టికి తెచ్చారు. పర్యటన సందర్భంగా ప్రధాని మన్మోహన్ సింగ్ వెంట ఉత్తరప్రదేశ్ గవర్నర్ బీఎల్ జోషి, ఆరోగ్యశాఖ మంత్రి అహ్మద్ హసన్ ఉన్నారు.












Click it and Unblock the Notifications