Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రూ.400 కోట్ల దారిదోపిడీ, మాయమైన కంటెయినర్లు వెనక మిస్టరీ

రాత్రి చీకట్లో... గుజరాత్‌ నుంచి బయలుదేరిన రెండు భారీ కంటెయినర్లు! చేరుకోవాల్సిన గమ్యం తిరుపతి... వయా.. మహారాష్ట్ర, గోవా, కర్ణాటక. లోపల ఏముంది? వందల కోట్ల రూపాయల నోట్ల కట్టలు! కట్ చేస్తే.. అక్టోబరు 22... ఆ కంటెయినర్లు కర్ణాటక అడవుల మధ్య ఉన్న చోర్లా ఘాట్‌కు చేరాయన్న తర్వాత కథ ఒక్కసారిగా తలకిందులైంది. "డబ్బు మాయం అయ్యింది!" ఈ ఒక్క న్యూస్ తో దేశ రాజకీయాల్లో కలకలం మొదలైంది.

గుజరాత్‌ నుంచి మహారాష్ట్ర, గోవా మీదుగా తిరుపతి వైపు ప్రయాణిస్తున్న రెండు భారీ కంటెయినర్లు... లోపల వందల కోట్ల రూపాయల నోట్ల కట్టలు ఉన్నాయన్న ఆరోపణలతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా సంచలనం రేగింది. అక్టోబరు 22న కర్ణాటకలోని చోర్లా ఘాట్‌ ప్రాంతంలో ఈ కంటెయినర్లు దారి దోపిడీకి గురయ్యాయన్న ఫిర్యాదు, రాజకీయాలు. పోలీసుల మధ్య ఘర్షణగా మారి తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఒక రాష్ట్రం 'భారీ దోపిడీ' అంటుంటే, మరో రాష్ట్రం 'అది అసలు జరిగినట్టే లేదు' అని తేల్చేయడం ఈ వ్యవహారాన్ని మరింత మర్మమైనదిగా మార్చింది.

Mystery of Missing Cash Containers Police Contradictions Political Blame and Rising Tensions

కథ అక్కడే మొదలైంది..

ఈ కథకు తెరలేపింది మహారాష్ట్రలోని నాసిక్‌ గ్రామీణ పోలీస్‌ స్టేషన్‌లో డిసెంబరు 17న నమోదైన ఫిర్యాదు. సందీప్‌ దత్త పాటిల్‌ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదులో, అక్టోబరు 22న రూ.400 కోట్లతో వెళ్తున్న రెండు కంటెయినర్లు దోపిడీకి గురయ్యాయని పేర్కొన్నాడు. అయితే, ఫిర్యాదుకు ముందే అతడు విడుదల చేసిన వీడియో మాత్రం ఈ కేసును పూర్తిగా మలుపు తిప్పింది. ఆ వీడియోలో రూ.400 కోట్ల మాట కాస్తా రూ.1000 కోట్ల దోపిడీగా మారింది. వీడియో వైరల్‌ కావడంతో ప్రభుత్వ యంత్రాంగం ఉలిక్కిపడింది.

ఆ దోపిడీకి తానే కారణమంటూ..

సందీప్‌ దత్త వాదన మరింత షాకింగ్‌గా మారింది. విశాల్‌నాయుడు, కిశోర్‌ శేఠ్‌ అనే ఇద్దరు వ్యక్తులు తనను కిడ్నాప్‌ చేసి, ఆ దోపిడీకి తానే కారణమంటూ నెలన్నర పాటు వేధించారని అతడు ఆరోపించాడు. ఈ వ్యవహారానికి వెనుక విరాట్‌ గాంధీ ఉన్నాడని కూడా ఫిర్యాదులో పేర్కొనడం సంచలనంగా మారింది. ఈ ఆరోపణలతో కేసు తీవ్రత ఒక్కసారిగా పెరిగిపోయింది. పరిస్థితి చేజారుతున్నదని భావించిన మహారాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)ను ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. దర్యాప్తులో భాగంగా జనవరి 16న కర్ణాటకలోని బెళగావి జిల్లా ఖానాపుర పోలీస్‌ స్టేషన్‌కు లేఖ రాసి సహకారం కోరారు. అయితే, ఆ లేఖలో కేసుకు సంబంధించిన కీలక వివరాలు లేవన్న ఆరోపణలతో మరో వివాదం మొదలైంది.

ఈ కేసుకు పూర్తిగా కొత్త మలుపు

బెళగావి ఎస్పీ రామరాజన్‌ కామెంట్స్ తో ఈ కేసుకు పూర్తిగా కొత్త మలుపు తిరిగింది. ఈ ఘటన జరిగినట్టు చెప్పబడుతున్న చోర్లా ఘాట్‌ ప్రాంతంలో దోపిడీకి సంబంధించిన ఎలాంటి ఆధారాలు లేవని ఆయన స్పష్టం చేశారు. బాధితుల ఫిర్యాదు లేదని, కనీసం దోపిడీకి గురైన కంటెయినర్ల నంబర్లు కూడా ఇవ్వలేదని చెప్పారు. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్‌ ప్రకారం ఇది దాదాపు గాలి వార్త కేసుగా భావిస్తున్నామని చెప్పడం సంచలనంగా మారింది.

కర్ణాటక క్లారిటీ..

ఈ కేసులో సహకరించేందుకు సిద్ధమేనని, లేదంటే దర్యాప్తును తమకే అప్పగించినా చేపడతామని కర్ణాటక స్పష్టం చేసింది. కర్ణాటక హోంమంత్రి జి. పరమేశ్వర్‌ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తూ, మహారాష్ట్ర పోలీసులు సరైన సమాచారం ఇవ్వలేదని, కోరితే పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. మహారాష్ట్రకు వెళ్లిన కర్ణాటక పోలీసులకు అక్కడి అధికారులు సహకరించలేదన్న ఆరోపణలు ఈ వ్యవహారాన్ని మరింత ఉద్రిక్తం చేశాయి.

పొలిటికల్ ఫ్లేవర్ యాడ్..

ఇంతలో ఈ దారిదోపిడీ కేసు రాజకీయ రంగు పులుముకుంది. రానున్న ఎన్నికల కోసం ఈ సొమ్మును కాంగ్రెస్‌ నేతలే తరలిస్తున్నారని బీజేపీ ఆరోపించడంతో రాజకీయ వేడి రాజుకుంది. దీనిపై కర్ణాటక మంత్రులు ప్రియాంక్‌ ఖర్గే, సతీశ్‌ జార్ఖిహొళి తీవ్రంగా స్పందిస్తూ, ఈ కేసు సమాచారాన్ని బయటపెట్టిందే మహారాష్ట్ర పోలీసులు అని గుర్తు చేశారు. మహారాష్ట్ర, గోవాల్లో భాజపా ప్రభుత్వాలే ఉన్నాయని, అరెస్టైన వారిలో కొందరు గుజరాత్‌కు చెందినవారని వారు ప్రస్తావించారు.

కొత్త ప్రశ్నలు

మరోవైపు, తరలిస్తున్న నగదు పాత రెండు వేల రూపాయల నోట్లని పోలీసులు చెబుతుండటం కొత్త ప్రశ్నలకు దారి తీసింది. ప్రస్తుతం చెల్లుబాటు కాని నోట్లను ఎవరు, ఎందుకు, ఎక్కడికి తరలిస్తున్నారు? అంత భారీ మొత్తానికి అసలు మూలం ఏమిటి? అనే అనుమానాలు మరింత బలపడుతున్నాయి. మరో మంత్రి ఎంబీ పాటిల్‌ మాట్లాడుతూ, ఇంత పెద్ద మొత్తంలో నగదు తరలిస్తున్న సమాచారం ముందే ఉంటే తప్పకుండా పోలీసు భద్రత కల్పించేవారమని తెలిపారు.

ఇప్పుడు ఈ కేసు నిజంగా వందల కోట్ల దోపిడీనా? లేక రాజకీయ లబ్ధి కోసం సృష్టించిన మాయా నాటకమా? అన్న ప్రశ్నలే మిగిలాయి. రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు, ఆధారాల లేమి, విరుద్ధ ప్రకటనల మధ్య ఈ నోట్ల కట్టల మిస్టరీకి నిజమైన ముగింపు చెప్పాల్సింది ఒక్క దర్యాప్తే.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+