సీఎం నుంచి ప్రధాని దాకా: నరేంద్ర మోడీ కుటుంబం, రాజకీయాలు.. క్లుప్తంగా
న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ... ఈ పేరు వింటే బీజేపీ కార్యకర్తలకు కొత్త ఉత్సాహం వస్తుంది. ముఖ్యమంత్రిగా గుజరాత్ను ముందంజలో నిలిపారు. ఆ తర్వాత 2014కు ముందు ప్రధానమంత్రి అభ్యర్థిగా తెరపైకి వచ్చారు. ప్రధాని అయ్యాక భారత దేశాన్ని ప్రపంచంలో మరింత ఉన్నత స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నారు. చాయ్ అమ్ముకునే స్థాయి నుంచి ప్రధానమంత్రి స్థాయికి ఎదిగారు.
నరేంద్ర మోడీకి నలుగురు సోదరులు. ఒక సోదరి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎక్కువగా వినియోగిస్తారు. వెంట లాప్టాప్ ఉంటుంది. పలు వ్యాసాలతో పాటు మూడు పుస్తకాలు రచించారు. సొంత ఆస్తి కూడబెట్టుకోలేదు. దేశశ్రేయస్సుకే ఆయన తపిస్తారు. మంచి వక్త. సాధారణంగా ముఖ్యమంత్రులు లేదా మంత్రులు వంటి పదవులు అధిష్టించిన వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు ఏదో విధంగా లబ్ధి పొందుతారు. రాజకీయాల్లోకి వస్తుంటారు. మోడీ అందుకు భిన్నం. ఆయన కుటుంబం అందుకు భిన్నం. మోడీ సోదరులు, సోదరి ఎవరి జీవితాలు వారివే. తల్లి హీరాబెన్. మోడీ శాకాహారి. బీసీ నాయకుడు.
నరేంద్ర మోడీ 17 సెప్టెంబర్ 1950న గుజరాత్లోని మెహ్సానా జిల్లా వాద్ నగర్లో జన్మించారు. వారిది మధ్య తరగతి కుటుంబం. రాజనీతి శాస్త్రంలో మాస్టర్ డిగ్రీ చేశారు. కాలేజీ చదువుతున్నప్పుడు ఏబీవీపీ నాయకుడిగా పని చేశారు. మోడీ 2001 నుంచి ప్రధాని అయ్యే ముందు వరకు గుజరాత్ సీఎంగా ఉన్నారు.
ముఖ్యమంత్రిగా మోడీకి అవకాశం వచ్చింది ఇలా
2001లో కేశూభాయ్ పటేల్ రాజీనామా చేశారు. దీంతో మోడీ సీఎం అయ్యారు. 2012లో గుజరాత్లో బీజేపీని గెలిపించి వరుసగా నాలుగోసారి గుజరాత్ సీఎం అయ్యారు. బీజేపీ 2014లో ఆయనను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడంతో 21 మే 2014న రాజీనామా చేశారు.
మూడు దశాబ్దాల తర్వాత రికార్డ్
2014లో బీజేపీ అద్భుత విజయం సాధించింది. అంతకుముందు మూడు దశాబ్దాలుగా ఏ పార్టీకి కూడా ఏకపక్ష విజయం దక్కలేదు. కానీ ఇందిరా గాంధీ తర్వాత నరేంద్ర మోడీ నేతృత్వంలో బీజేపీ ఆ ఘనత సాధించింది. ఏకంగా 280కి పైగా స్థానాలు గెలిచింది. మేజిక్ ఫిగర్ 272. బీజేపీకి సంపూర్ణ మెజార్టీ ఉన్నప్పటికీ మిత్రపక్షాలతో కలిసి పోటీ చేసినందున మిత్రధర్మం కోసం బీజేపీ ప్రభుత్వం కాకుండా ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
రాజకీయ జీవితం, అద్వానీ శిష్యుడు
మోడీ 1987లో బీజేపీలో చేరారు. కొద్దికాలంలో పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి చేపట్టారు. 1990లలో అద్వానీ చేపట్టిన రథయాత్రకు, 1992లో మురళీ మనోహర్ జోషి కన్యాకుమారి - కాశ్మీర్ యాత్రకు ఇంచార్జిగా పని చేశారు. 1998లో జాతీయ ప్రధాన కార్యదర్శి అయ్యారు. కేశూభాయ్ పటేల్ రాజీనామాతో అక్టోబర్ 2001లో మోడీ గుజరాత్ సీఎం అయ్యారు. 2002లో గోద్రా అల్లర్లు నేపథ్యంలో విమర్శలు రావడంతో రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లారు.
వరుసగా గుజరాత్లో నాలుగుసార్లు
గోద్రా అల్లర్ల తర్వాత, 2002 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో 182 స్థానాలకు గాను బీజేపీ 126 స్థానాల్లో విజయబావుటా ఎగురువేసింది. 2007లో 182 స్థానాలకు గాను 117 స్థానాల్లో బీజేపీ గెలిచింది. 2012లో బీజేపీ మరోసారి విజయం సాధించింది. రెండేళ్లకు ఆయనను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించారు.
అభివృద్ధి కార్యక్రమాలు
మోడీ హయాంలో గుజరాత్ ఎంతో అభివృద్ధి సాధించింది. ఉజ్వల గుజరాత్ పేరుతో విదేశీ పెట్టుబడులను ఆకర్షించారు. నర్మదా ఆనకట్ట ఎత్తును పెంచి లక్షళ ఎకరాల భూమిని సాగులోకి తెచ్చారు. తాగునీరు, జల విద్యుత్ పై ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. మహిళ కోసం అనేక పథకాలు ప్రవేశ పెట్టారు. పెట్టుబడులను ఆకర్షించడంలో, పారిశ్రామిక అభివృద్ధిలో, ఎగుమతుల్లో గుజరాత్ను నెంబర్ వన్గా నిలిపారు. సీఎంగా మోడీ పాలనపై అమెరికా సైతం కొనియాడింది.
విదేశాల్లో మారుమోగుతున్న భారత్ పేరు
మోడీ ప్రధాని అయ్యాక విదేశాల్లో భారత్ పేరు మరింత మార్మోగుతోంది. పలు దేశాలతో సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. అమెరికా వంటి దేశాలు మరింత దగ్గరవుతున్నాయి. డొక్లాం వంటి సమస్య వచ్చినప్పుడు చైనాకు ధీటుగా నిలిచింది భారత్. మోడీ ప్రధాని అయ్యాక అందరికీ ఆరోగ్యం కలిగించే ఇంటర్నేషనల్ యోగా డే వచ్చింది. జీఎస్టీ, రూ.500, రూ.1000 నోట్ల రద్దు కీలక నిర్ణయాలు.