ఫలించిన మోడీ దౌత్యం, అంతర్జాతీయంగా ఒంటరైన పాక్, ఇప్పటికైనా బుద్ధి వస్తుందా?
న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోడీ అంతర్జాతీయ దౌత్య విధానాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. దాయాది దేశం పాకిస్తాన్ను అంతర్జాతీయంగా ఒంటరిని చేయడంలో మోడీ విజయం సాధించారు. ఆయన అనుసరించిన విధానాలు చివరికి ప్రపంచ దేశాల దృష్టిలో పాక్ను ఒక దోషిగా నిలబెట్టాయి.
ఇన్నేళ్లూ మమ్మల్ని వాడుకుని.. ఇప్పుడు మాపై నిందలా?: అగ్రరాజ్యంపై పాకిస్తాన్ ఎదురుదాడి!
ఆగని పాక్ ఆగడాలు, గాల్లో కలిసిపోతున్న జవాన్ల ప్రాణాలు..'సర్జికల్ స్ట్రయిక్స్' వల్ల ఒరిగిందేమిటి?
పాకిస్తాన్ ఒక ఉగ్రవాదం దేశమనే విషయాన్ని ప్రపంచ దేశాలకు తెలియజెప్పడంలో ప్రధాని మోడీ విజయం సాధించారు. ముఖ్యంగా అంతర్జాతీయ సమాజం, అగ్రరాజ్యం అమెరికా దృష్టిలో పాకిస్తాన్ను ఒక దోషిగా నిలబెట్టడంలో మోడీ అవలంభించిన దౌత్య విధానాలు అసామాన్యం.
అలస్యంగా కళ్లు తెరిచిన అమెరికా...
ఇన్నాళ్లూ తన కల్లిబొల్లి కబుర్లతో అగ్రరాజ్యం అమెరికాను సైతం పాకిస్తాన్ బుట్టలో పెట్టింది. కానీ డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడైన తరువాత పాక్ పట్ల అమెరికా విధానం మారుతూ వచ్చింది. ఉగ్రవాదం విషయంలో ఇప్పటికే పాకిస్తాన్ను పలుమార్లు హెచ్చరించిన అమెరికా అది మాటలతో వినదని గ్రహించి చేతల్లోకి దిగింది. ఉగ్గుపాలు పోసి పోషిస్తున్న పాకిస్తాన్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిమ్మతిరిగే షాకిచ్చారు. నూతన సంవత్సరం రోజునే ట్రంప్ తీసుకున్న నిర్ణయం పాకిస్తాన్కు ముచ్చెమటలు పట్టిస్తోంది. ఉగ్రవాదాన్ని తుదముట్టిస్తామంటూ అమెరికా నుంచి నిధులు పొందుతున్న పాకిస్తాన్ వాస్తవంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది. ఈ విషయాన్ని గ్రహించిన ట్రంప్ ప్రభుత్వం పాకిస్తాన్పై కన్నెర్ర జేసింది.
ట్విట్టర్లో బాంబు పేల్చిన ట్రంప్...
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం ట్విటర్ వేదికగా పాకిస్తాన్పై మరోసారి తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. నిధుల కోసం ఆ దేశం అబద్ధాలు చెప్పి.. మోసం చేసిందని ఆరోపించారు. పాక్ ఉగ్రవాదులకు స్వర్గధామంగా ఉందని మరోసారి పునరుద్ఘాటించారు.
‘గత 15ఏళ్లుగా పాకిస్తాన్కు అమెరికా తెలివితక్కువగా.. దాదాపు 33 బిలియన్ డాలర్లకు పైగా నిధులు ఇచ్చింది. కానీ వాళ్లు మాత్రం మమ్మల్ని మోసం చేస్తూ అబద్ధాలు చెబుతూ వచ్చారు. వాళ్లు మా నేతలను ఫూల్స్ అనుకుంటున్నారు. పాక్ ఉగ్రవాదులకు స్వర్గధామంగానే ఉంది. ఇక ఆ ఆటలు సాగబోవు..' అంటూ ట్రంప్ చేసిన ట్వీట్ పాకిస్తాన్కు చలిజ్వరం తెప్పించింది. అంతేకాకుండా పాకిస్తాన్కు యూఎస్ నుంచి అందే 255 మిలియన్ డాలర్ల సాయాన్ని కూడా నిలిపివేస్తామంటూ ట్రంప్ హెచ్చరించడంతో పాకిస్తాన్ పాలకులు ఉక్కరిబిక్కిరవుతున్నారు.
ట్రంప్ను ప్రసన్నం చేసుకునే దిశగా...
అమెరికాకు కోపం వచ్చిందని గ్రహించగానే పాకిస్తాన్ కంటితుడుపు చర్యలు ప్రారంభించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను తిరిగి ప్రసన్నం చేసుకునే దిశగా తన ప్రయత్నాలు మొదలుపెట్టింది. ముంబై పేలుళ్ల ప్రధాన సూత్రధారి, అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్ సయీద్ ఆధ్వర్యంలో నడుస్తున్న సంస్థలు విరాళాలు సేకరించకుండా నిషేధం విధించింది. అంతేకాదు, హఫీజ్ సయీద్కు చెందిన ఆస్తులను జప్తు చేసేందుకు కూడా రహస్యంగా ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు సమాచారం. పాక్ ప్రభుత్వానికి చెందిన ముగ్గురు అధికారుల సమక్షంలో ఈ రహస్య ప్రణాళిక రహస్యం రూపుదిద్దుకుంటున్నట్లు పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ ఉన్నతాధికారి తెలిపారు. హఫీజ్ సయీద్ ఉగ్రవాద సంస్థ జమాత్-ఉల్-దవా(జేయూడీ), ఫలాఫ్-ఈ-ఇన్సానియత్ ఫౌండేషన్(ఎఫ్ఐఎఫ్)కు చెందిన ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని పాక్ యోచిస్తోంది.
మోడీ దౌత్యం.. పాకిస్తాన్కి శాపం: ముషారఫ్
అంతర్జాతీయ దౌత్య సంబంధాలను కొనసాగించడంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ విజయం సాధించారని పాకిస్తాన్ మాజీ సైనిక పాలకుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్ అభిప్రాయపడ్డారు. పాకిస్తాన్ న్యూస్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ముషారఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మోడీ దౌత్య విధానాలు తమ దేశానికి శాపంగా మారాయని ముషారఫ్ ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు, మోడీ అనుసరించిన విధానాలు.. పాక్ను అంతర్జాతీయ స్థాయిలో దోషిగా నిలబెట్టాయని అన్నారు. ఇప్పటివరకూ కుల్భూషణ్ జాదవ్ను గూఢచారిగా భారత్ గుర్తించనే లేదని, పాకిస్తాన్ మాత్రం తొందరపడి లష్కరే తోయిబాను ఉగ్రసంస్థగా గుర్తించిందని వ్యాఖ్యానించారు.
పాకిస్తాన్కు ఇకనైనా బుద్ధి వస్తుందా?
మొత్తానికి ఇన్నాళ్లకు భారత్ వ్యూహం ఫలించింది. సరిహద్దుల్లో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల ఆగడాలు, వారికి పాకిస్తాన్ నుంచి అందుతున్న సహాయం, ముంబై పేలుళ్ల ప్రధాన సూత్రధారి, అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్ సయీద్కు లోలోపల అందిస్తోన్న సహాయం, కుల్భూషణ్ జాదవ్ విషయంలో పాకిస్తాన్ కపట వైఖరి, చైనాతో పాకిస్తాన్ దోస్తీ, నమ్మించి అమెరికాను మోసగిస్తున్న వైనం.. తదితర విషయాలను ఎప్పటికప్పుడు అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకురావడంతో ప్రధాని మోడీ అనుసరించిన దౌత్య విధానాలు కీలకంగా నిలిచాయి. పాకిస్తాన్ బట్టలూడదీసి దాని నిజస్వరూపం ఏమిటో అర్థమయ్యేలా చేయడంలో భారత దౌత్యం విజయం సాధించింది. మరి ఉగ్రపాకిస్తాన్కు ఇప్పటికైనా బుద్ధి వస్తుందా? కాలమే నిరూపించాలి.