మధ్యప్రదేశ్లో బీజేపీదే గెలుపు: కాంగ్రెస్కు సొంత మీడియా 'సర్వే' షాక్
భోపాల్: కాంగ్రెస్ పార్టీకి చెందిన నేషనల్ హెరాల్ట్ మీడియా సొంత పార్టీకి షాకిచ్చింది. మధ్యప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని సర్వేలో తేలిందని తెలిపింది. నేషనల్ హెరాల్డ్ కాంగ్రెస్ పార్టీ అనుకూల పత్రిక. ఈ మీడియాలోనే అధికార పార్టీ గెలుస్తుందని రావడం కలకలం రేపుతోంది.
స్పిక్ మీడియా ఇక్కడ ప్రీపోల్ సర్వే ఫలితాలు అంటూ ఈ వెబ్ సైట్ ఇచ్చింది. ఇక్కడ బీజేపీకి 147, కాంగ్రెస్ పార్టీకి 73 వస్తాయని పేర్కొంది. కాంగ్రెస్, బీఎస్పీ కలిస్తే ఎలా వస్తాయి, వేర్వేరుగా పోటీ చేస్తే ఎలా వస్తాయని కూడా పేర్కొంది.
కాంగ్రెస్, బీఎస్పీ కలిస్తే, విడిగా అయితే
కాంగ్రెస్, బీఎస్పీలు వేర్వేరుగా పోటీ చేస్తే బీజేపీకి మంచి మెజార్టీ వస్తుందని సర్వేలో తేలిందని పేర్కొంది. కాంగ్రెస్, బీఎస్పీలు కలిసి పోటీ చేస్తే బీజేపీకి సీట్లు తగ్గినా అధికారం మాత్రం వస్తుందని, కొన్ని సీట్లు తగ్గిన స్పష్టమైన మెజార్టీ వస్తుందని పేర్కొంది. మధ్యప్రదేశ్లో 230 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.
ఎవరికి ఎన్ని సీట్లు అంటే?
కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ, బీఎస్పీ అధినేత్రి మాయావతి కలిస్తే కనుక బీజేపీ 126 సీట్లకే పరిమితమవుతుందని ఈ సర్వేలో తేలింది. అప్పుడు కాంగ్రెస్ - బీఎస్పీ కూటమి 103 సీట్లు గెలుచుకుంటుందని పేర్కొంది. ఒకవేళ కాంగ్రెస్-బీఎస్పీ కూటమి కట్టకుంటే బీజేపీ 147 స్థానాలు వస్తాయని, కాంగ్రెస్కు 73 స్థానాలే వస్తాయని అంచనా వేసింది.
స్పిక్ మీడియా నెట్ వర్క్ ప్రీపోల్ సర్వే
స్పిక్ మీడియా నెట్వర్క్ చేసిన ప్రీపోల్ సర్వేను నేషనల్ హెరాల్డ్ ప్రచురించడం ఆసక్తిని రేపుతోంది. స్పిక్ మీడియా సర్వేలో మధ్యప్రదేశ్లో బీజేపీ విజయం ఖాయమని తేలింది. రాష్ట్రంలోని 230 అసెంబ్లీ సీట్లలో బీజేపీ 147 స్థానాలను సొంతం చేసుకుని అధికారంలోకి వస్తుందని సర్వేలో వెల్లడైనట్టు తెలిపింది.
నరేంద్ర మోడీ
రాఫెల్ డీల్ను బోఫోర్స్తో పోల్చిన మరునాడే నేషనల్ హెరాల్డ్లో స్పిక్ సర్వే ఫలితాలను ప్రచురించడం గమనార్హం. ఇదిలా ఉండగా, ప్రధాని నరేంద్ర మోడీ అత్యంత ఆకర్షణీయమైన వ్యక్తి అని సర్వే పేర్కొంది. మోడీకి 41 శాతం మంది ఓటు వేయగా, రాహుల్ గాంధీ 9.72 శాతంతో ఈ జాబితాలో రెండోస్థానంలో నిలిచారు.