సీఎం నవీన్ కొత్త రికార్డు, దేశంలోనే రెండో వ్యక్తిగా - నిశ్శబ్ద విప్లవానికి చిరునామా..!!
ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్. దేశంలో అత్యధిక కాలం సీఎం పదవిలో కొనసాగిన రెండో వ్యక్తిగా రికార్డు సృష్టించారు. ఇప్పటివరకు రెండో స్థానంలో ఉన్న పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం జ్యోతిబసును ఆయన వెనక్కి నెట్టారు. నవీన్ శైలి విలక్షణం. ఇతర నేతల్లాగా ఆర్భాటపు ప్రచారాలు ఉండవు. నిశ్శబ్దంగానే నిర్ణయాలు..పెను మార్పులకు నిర్ణయాలు తీసుకోవటం నవీన్ ప్రత్యేకత. అయన పైన విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు కొత్త రికార్డు దిశగా అడుగులు వేస్తున్నారు.
అరుదైన ఘనత: ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ అరుదైన ఘనత సాధించారు. ఇప్పటివరకు దేశంలో అత్యధిక కాలం సీఎంగా కొనసాగిన రికార్డు పవన్ కుమార్ చామ్లింగ్ పేరిటే ఉంది. ఆయన 1994 డిసెంబర్12 నుంచి 2019 మే 27 వరకు 24 ఏళ్లకు పైగా సీఎం పదవిలో సేవలు అందజేశారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేడీ విజయం సాధించి నవీన్ పట్నాయక్ మరోసారి సీఎం అయితే అత్యధిక కాలం సీఎంగా కొనసాగిన వ్యక్తిగా రికార్డు సృష్టించనున్నారు. ప్రస్తుతం ఒడిశా ముఖ్యమంత్రిగా ఐదోసారి నవీన్ పట్నాయక్ సేవలు అందిస్తున్నారు.

1997లో తండ్రి బీజూ పట్నాయక్ మరణించడంతో ఆయన వారసుడిగా నవీన్ పట్నాయక్ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తన తండ్రి పేరుతో బీజూ జనతా దళ్ (బీజేడీ)ని ఏర్పాటు చేసి 1997 నుంచి ఆ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అదే ఏడాది ఎంపీగా విజయం సాధించారు. 1998 నుంచి 2000 వరకు కేంద్రమంత్రిగానూ పనిచేశారు.
జ్యోతిబసు రికార్డు అధిగమించి: 2000 సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి ఒడిశాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అలా 2000 మార్చి 5న తొలిసారి ఆయన సీఎం పదవిని చేపట్టారు. 23 ఏళ్ల 138 రోజులుగా ఆయన ఈ పదవిలో కొనసాగుతున్నారు. చిన్నతనంలో రాజకీయాలకు దూరంగా పెరిగిన నవీన్ పట్నాయక్ తండ్రి మరణం తర్వాతే రాజకీయాల్లోకి రంగప్రవేశం చేశారు.
ఇప్పటివరకు ఐదుసార్లు ముఖ్యమంత్రి పదవిని అధిష్టించారు. కాగా పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం జ్యోతి బసు 1977 జూన్ 21 నుంచి 2000 నవంబర్ 5 వరకు 23 ఏళ్ల 137 రోజులపాటు సీఎం పదవిలో కొనసాగారు. చామ్లింగ్, జ్యోతిబసు తర్వాత వరుసగా ఐదుసార్లు ముఖ్యమంత్రి అయిన మూడో నేత నవీన్ పట్నాయక్. 2014, 2019 ఎన్నికల్లో ఒంటరిగానే పార్టీని గెలిపించి వరుసగా అయిదుసార్లు సీఎం అయ్యారు.

నిశ్శబ్దంగా పెను మార్పులతో: నవీన్ పట్నాయక్ రాజకీయాలు..ముఖ్యమంత్రిగా పని తీరు ఇతరులకు భిన్నంగా ఉంటుంది. ప్రజలకు, పార్టీ నాయకులకు ఏం తెలియాలో..ఎంత వరకు తెలియాలో అంత వరకే తెలియనివ్వటంలో నవీన్ దిట్ట, పార్టీలో ఏం జరుగుతోందో ముఖ్యమంత్రి సన్నిహితులకు సైతం తెలియదు. టికెట్ల పంపకం, మంత్రుల నియామకం అంతా ఆయన కనుసన్నుల్లోనే ఉంటుంది.
2012లో నవీన్ పట్నాయక్ లండన్ లో ఉన్న సమయంలో ముగ్గురు మంత్రులు..34 మంది ఎమ్మెల్యేతో నవీన్ రాజకీయ సలహాదారు ప్యారీ మహాపాత్రో సమావేశమయ్యారు. తనను పదవి నుంచి దింపేందుకు వెంటనే రంగంలోకి దిగి పరిస్థితి చక్క దిద్దారు. నవీన్ 23 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్నా ఒడిశా పేద రాష్ట్రంగానే మిగిలింది. దీని పైనే ప్రతిపక్షాల విమర్శలు కొనసాగుతున్నాయి.












Click it and Unblock the Notifications