బీజేపీ గూఢచారి?: శివసేన, ఎన్సీపీ ఎమ్మెల్యేల మధ్యలో సివిల్ డ్రెస్లో పోలీస్! అంతా అలర్ట్
ముంబై: మహారాష్ట్ర రాజకీయ పరిణామాలు మలుపుల మీద మలుపులు తిరుగుతున్నాయి. ఓ వైపు బీజేపీ అధికారం నిలబెట్టుకునేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తుంటే.. తమ ఎమ్మెల్యేలను బీజేపీ దరిచేరకుండా శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి.
మరో హోటల్కు..
ఇప్పటికే తమ తమ ఎమ్మెల్యేలను శివసేనతోపాటు ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు క్యాంపులకు తరలించాయి. ముంబైలోని పలు హోటళ్లలో ఎమ్మెల్యేలను పెట్టాయి. భద్రతా కారణాల దృష్త్యా తమ ఎమ్మెల్యేలను హోటల్ రినైజాన్స్ నుంచి హోటల్ హయత్కు తరలించేందుకు ఎన్సీపీ ప్రయత్నిస్తోంది.
హోటల్లో సివిల్ డ్రెస్సులో పోలీసు..
ఎందుకంటే.. హోటల్ రినైజాన్స్లో ఓ పోలీసు అధికారి సాధారణ దుస్తుల్లో తిరుగుతూ కనిపించారు. అతడ్ని ఎన్సీపీ నేతలు గుర్తించి ప్రశ్నించారు. ఇక్కడ ఏం పని అంటూ అతడ్ని నిలదీశారు. ఇదంతా బీజేపీ చేస్తున్న కుట్రలో భాగమేనంటూ ఎన్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
ప్రభుత్వాన్ని నడిపిస్తున్న వారి కుట్రే..
కాగా, ప్రభుత్వాన్ని నడిపిస్తున్న బీజేపీనే పోలీసులతో ఇలా నిఘా పెడుతోందంటూ ఎన్సీపీ నేతలు మండిపడుతున్నారు. పోలీసులు ప్రభుత్వం చెప్పకుండా ఇలాంటి గూఢచార పనులు చేయరని ఎన్సీపీ ఎమ్మెల్యే జితేందర్ అవ్హద్ ఆరోపించారు. తమ ఎమ్మెల్యేలపై నిఘా పెట్టేందుకే ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.
మూడు పార్టీలు అలర్ట్..
ఇప్పటికే 49 మంది తమ ఎమ్మెల్యేలు తమ వద్దే ఉన్నారంటూ ఎన్సీపీ ప్రకటించిన విషయం తెలిసిందే. శివసేనకు చెందిన 56 మంది ఎమ్మెల్యేలను కూడా ఆ పార్టీ అధినేత ఉద్ధవ్ థాక్రే ఓ హోటళ్లో ఉంచారు. కాంగ్రెస్ పార్టీ కూడా తమ ఎమ్మెల్యేలను క్యాంపులకు తరలించింది. ఈ మూడు పార్టీల ఎమ్మెల్యేలను ఎటూ వెళ్లకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశాయి. తాజా వ్యవహారంతో ఈ మూడు పార్టీలు మరోసారి అలర్ట్ అయ్యాయి.
కొనసాగుతున్న బీజేపీ ప్రయత్నాలు..
మరో వైపు బీజేపీ పలువురు ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. బహిష్కృత ఎన్సీపీ నేత, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ వెంట కేవలం ఐదుగురు ఎమ్మెల్యేలే ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీకి 105 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలంటే ఆ పార్టీకి ఇంకా 40 మంది ఎమ్మెల్యేల అవసరం ఉంది. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 స్థానాలు ఉండగా, మ్యాజిక్ ఫిగర్ 145గా ఉంది.