మదరసాకు బిగ్ షాక్- ఏపీ సీఎస్ సహా అన్ని రాష్రాలకూ లేఖలు
Madrasa: బాలల హక్కుల పరిరక్షణ జాతీయ కమిషన్ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. దేశంలో అన్ని రాష్ట్రాల్లో గల మదరసాల మూసివేతకు సిఫారసులు చేసింది. వాటికి మంజూరు చేస్తోన్న నిధులనూ తక్షణమే నిలిపివేయాలని కోరింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖ రాసింది.
2009 నాటి విద్యా హక్కు చట్టం కింద ఈ సిఫారసులను చేసింది బాలల హక్కుల పరిరక్షణ జాతీయ కమిషన్. మదరసాల్లో చదువుకుంటోన్న లేదా వాటిల్లో అడ్మిషన్లు పొందడానికి తమ పేర్లను నమోదు చేయించుకున్న ముస్లిమేతర విద్యార్థులను ఇతర ప్రభుత్వ పాఠశాలలకు తరలించాలనీ ఆదేశించింది.

దేశవ్యాప్తంగా ముస్లిం సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులు, వాళ్ల స్థితిగతులను అధ్యయనం చేసిన తరువాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బాలల హక్కుల పరిరక్షణ జాతీయ కమిషన్ ఛైర్మన్ ప్రియాంక్ కానుంగో వెల్లడించారు. ఇక్కడ చదువుకుంటోన్న ప్రతి విద్యార్థి కూడా దేశ సమగ్రాభివృద్ధిలో భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉందని, ఈ రకంగా వారి ఉజ్వల భవిష్యత్తును తీర్చిదిద్దడానికి అవసరమైన ప్రణాళికలను రూపొందించుకునేలా మదరసా వ్యవస్థను పునఃసమీక్షించుకోవాలని అన్నారు.
మదరసాల కారణంగా ముస్లిం సామాజిక వర్గానికి చెందిన పిల్లలు అత్యంత విలువైన పాఠశాల విద్యకు దూరమౌతున్నట్లు భావిస్తున్నామని ప్రియాంక్ కానుంగో అభిప్రాయపడ్డారు. వారి హక్కుల ఉల్లంఘనగా అభివర్ణించారు. ఈ విషయంపై అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు లేఖ ద్వారా నివేదిక పంపామని వివరించారు.
ఆయా రాష్ట్రాల్లోని మదరసా బోర్డులను మూసివేయాలని కోరినట్లు ప్రియాంక్ కానుంగో వెల్లడించారు. ఏ ఉద్దేశంతో మదరసా బోర్డులు ఏర్పాటయ్యాయో.. వాటిని అందుకోవడంలో విఫలం అయ్యాయని తేల్చిచెప్పారు. ప్రస్తుతం దేశంలో బోర్డు పరిధిలో లేని మదరసాల్లో 1.25 కోట్ల మంది పిల్లలు ఉన్నారని ఆయన తెలిపారు.
ముస్లిమేతరులు, హిందూ మతానికి చెందిన పిల్లలతో సహా వారికి సరైన విద్యాబోధనలు జరగట్లేదని ప్రియాంక్ కానుంగో చెప్నారు. అయినప్పటికీ- ప్రభుత్వ నిధులను భారీగా అందుకుంటున్నాయని వ్యాఖ్యానించారు. మదరసాలకు నిధుల మంజూరు పట్ల తొమ్మిది సంవత్సరాలుగా అధ్యయనం చేసిన తరువాతే తాము ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని అన్నారు.












Click it and Unblock the Notifications