Tamil Nadu Survey: తమిళ ఓటర్ల మొగ్గు క్లియర్..! తాజా సర్వేలో ఎవరికెన్ని సీట్లంటే ?
తమిళనాడు (Tamil Nadu) అసెంబ్లీకి ఈసారి జరుగుతున్న ఎన్నికల ప్రచారం ఇవాళ్టితో సమాప్తం కానుంది. ఎల్లుండి రాష్ట్రంలోని 234 సీట్లలోనూ ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో అధికార డీఎంకే (DMK) కూటమి పార్టీలతో పాటు విపక్ష అన్నాడీఎంకే (AIADMK) కూటమి, విజయ్ పార్టీ టీవీకే తుది ప్రయత్నాల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో అసలు రాష్ట్రంలో ఓటర్ల మొగ్గు ఎవరివైపు ఉందన్న అంశంపై ఇప్పటికే పలు సర్వే సంస్థలు (Tamil Nadu Survey) అభిప్రాయ సేకరణ చేసి ఫలితాలు ఇచ్చాయి. ఇదే క్రమంలో తాజాగా నిర్వహించిన మరో సర్వే ఫలితాలు వెల్లడయ్యాయి.
తమిళనాడు ఎన్నికలపై పొలిటికల్ వ్యూస్ సంస్థ నిర్వహించిన తాజా సర్వేలో విపక్ష అన్నాడీఎంకే కూటమివైపు మొగ్గు కనిపిస్తోంది. అసెంబ్లీలో మొత్తం 234 సీట్లలో అన్నాడీఎంకే-బీజేపీ కూటమికి 122-140 సీట్లు లభించే అవకాశం ఉందని పొలిటికల్ వ్యూస్ అంచనా వేసింది. అలాగే అధికార డీఎంకే కూటమికి కేవలం 88-106 సీట్లు మాత్రమే వస్తున్నట్లు తెలిపింది. ఇక విజయ్ కొత్త పార్టీ టీవీకే 2-8 సీట్లు మాత్రమే సాధించి ఉనికి చాటుకోనున్నట్లు వెల్లడించింది.

మరోవైపు రాష్ట్రంలో ఇప్పటివరకూ నిర్వహించిన మెజార్టీ సర్వేలు డీఎంకే కూటమికే ఆధిక్యం కట్టబెట్టాయి. కానీ జేవీసీ పోల్స్, సీ-ఓటర్-మ్యాట్రిజ్, న్యూస్ 18 మాత్రం అన్నాడీఎంకే కూటమి గెలుస్తుందని చెప్పాయి. ఈ నేపథ్యంలో పొలిటికల్ వ్యూస్ తాజా సర్వేకు ప్రాధాన్యం ఏర్పడింది. అయితే రాష్ట్రంలో డీఎంకే కూటమిపై ఉన్న ప్రజా వ్యతిరేకతకు విజయ్ ఓట్ల చీలిక ఫ్యాక్టర్ తోడైతే అన్నాడీఎంకే కూటమి గెలుపు ఖాయమనే అంచనాలు వెలువడుతున్నాయి. దీంతో ఈసారి ఎన్నికలపై ఉత్కంఠ మరింత పెరుగుతోంది.












Click it and Unblock the Notifications