భారత్లో పేలిన బ్రిటన్ బీ.1.1.7 వైరస్ బాంబ్: రెండేళ్ల చిన్నారికీ కొత్త స్ట్రెయిన్: 20 మందికి
న్యూఢిల్లీ: దేశంలో కొత్త కరోనా వైరస్ స్ట్రెయిన్ బాంబు పేలినట్టే. కొత్త కరోనా వైరస్ బారిన పడిన వారి సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. తొలుత ఈ వైరస్ లక్షణాలు ఆరుమందిలో మాత్రమే కనిపించగా..కొన్ని గంటల్లోనే ఈ సంఖ్య మూడింతలైంది. 20కి చేరుకుంది. ఇది ఇక్కడితో ఆగేలా కనిపించట్లేదు. ఇప్పటికే సాధారణ కరోనా వైరస్ సృష్టించిన భయానక పరిస్థితుల నుంచి కోలుకుంటోన్న దశలో.. దేశంలో ఈ కొత్త స్ట్రెయిన్ దిగుమతి కావడం పట్ల ఆందోళన వ్యక్తమౌతోంది. ఈ మహమ్మారి ఇంకెంత మందిని బలి తీసుకుంటుందోననే భయాలు నెలకొన్నాయి.
అమెరికాలో కొత్త కరోనా వైరస్ స్ట్రెయిన్: తొలికేసు: నో ట్రావెల్ హిస్టరీ: లోకల్గా వ్యాప్తి
ఇప్పటిదాకా 20 మందిలో కొత్త కరోనా వైరస్ స్ట్రెయిన్ లక్షణాలు కనిపించినట్లు తేలింది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్రల్లో కొత్త కరోనా వైరస్ వేరియంట్ కేసులు వెలుగులోకి వచ్చాయి. దేశ రాజధానిలోని క్వారంటైన్ సెంటర్ నుంచి పారిపోయి.. రాజమహేంద్రవరానికి చేరుకున్న మహిళలోనూ కొత్త కరోనా వైరస్ లక్షణాలు కనిపించాయి. ఇప్పటిదాకా బ్రిటన్ నుంచి వచ్చిన వారిలో మాత్రమే ఈ వైరస్ లక్షణాలు కనిపించిందని, స్థానికంగా వ్యాప్తి చెందలేదని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.
బ్రిటన్ నుంచి న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరకున్నఆమెను అధికారులు క్వారంటైన్కు తరలించగా.. ఆమె అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయి రైలులో రాజమహేంద్రవరానికి వచ్చారు. రైలులో ఆమె ప్రయాణించడం ద్వారా మరింత మందికి కొత్త కరోనా వైరస్ స్ట్రెయిన్ సోకి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఈ పరిణామం.. స్థానికంగా కొత్త స్ట్రెయిన్ వ్యాప్తి చెందడానికి కారణమౌతుందని భావిస్తున్నారు.
ఉత్తర ప్రదేశ్లోని మీరట్కు చెందిన రెండేళ్ల చిన్నారికి కొత్త కరోనా వైరస్ సోకింది. జ్వరం, దగ్గుతో బాధపడుతోన్న ఆ చిన్నారికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. అనంతరం ఆ నమూనాలను ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఙాన సంస్థ (ఎయిమ్స్)కు పంపించారు. అక్కడ నిర్వహించిన పరీక్షల్లో.. ఆ పాపకు సోకింది సాధారణ కరోనా వైరస్ కాదని తేలింది. బ్రిటన్లో పుట్టుకొచ్చిన కొత్త కరోనా వైరస్ వేరియంట్ బీ.1.1.7గా నిర్ధారించారు. ఉత్తర ప్రదేశ్ వైద్యమంత్రిత్వ శాఖ అధికారులు ఆ విషయాన్ని ధృవీకరించారు.
ఈ చిన్నారి కుటుంబం నివసిస్తోన్న టీపీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంత్ విహార్ ప్రాంతం మొత్తాన్నీ స్థానిక అధికారులు సీల్ చేశారు. ఉత్తర ప్రదేశ్లో నమోదైన తొలి కరోనా వైరస్ స్ట్రెయిన్ కేసు ఇదే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. బెంగళూరులో ఇప్పటిదాకా మూడు కొత్త కరోనా స్ట్రెయిన్ కేసులు నమోదు అయ్యాయి. ఆ ముగ్గురూ బ్రిటన్ నుంచి వచ్చిన వారే. వారు నివసిస్తోన్న అపార్ట్మెంట్ మొత్తాన్నీ అధికారులు సీజ్ చేశారు.