కుంభ మేళా రైలు ఎక్కడం కోసం తొక్కిసలాట: కాళ్ల కింద నలిగి 18 మంది దుర్మరణం
New Delhi Railway Station Stampede: న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో అత్యంత విషాదకర దుర్ఘటన చోటు చేసుకుంది. ఇక్కడ సంభవించిన తొక్కిసలాటలో 18 మంది దుర్మరణం పాలయ్యారు. వారిలో 14 మంది మహిళలు ఉన్నారు. మరో నలుగురు చిన్న పిల్లలు. మరో 60 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
మహా కుంభమేళా సందర్భంగా త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలను ఆచరించడానికి ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్కు బయలుదేరి వెళ్లాల్సిన ఎక్స్ప్రెస్ అది. శనివారం రాత్రి 9:55 నిమిషానికి 15వ నంబర్ ప్లాట్ఫామ్ మీదికి రాగానే ప్రయాణికులు ఒక్కసారిగా ఎగబడ్డారు. సీటు కోసం పోటీ పడ్డారు.

అదే సమయంలో స్వతంత్ర సేనాని ఎక్స్ప్రెస్, భువనేశ్వర్ రాజధాని ఎక్స్ప్రెస్లు 12, 13, 14 ప్లాట్ఫామ్ మీదికి చేరుకున్నాయి. ఈ రెండు రైళ్లనూ ఎక్కడానికి అప్పటికే ఆయా ప్లాట్ఫామ్ల మీద 2,000 మందికి పైగా ప్రయాణికులు సిద్ధంగా ఉన్నారు. రైల్వే స్టేషన్ మొత్తం ఇసుక వేస్తే రాలనంత రద్దీగా మారింది.
ప్రయాణికులు ఆయా రైళ్లు ఎక్కడానికి ప్రయత్నించడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో 18 మంది దుర్మరణం పాలయ్యారు. 60 మందికి పైగా గాయపడ్డారు. వారిని లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ్, రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రులకు తరలించారు. చికిత్స అందిస్తోన్నారు. మృతుల సంఖ్యను ఢిల్లీ పోలీసులు అధికారికంగా ప్రకటించారు.
ఈ ఘటన పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం శాఖ మంత్రి అమిత్ షా, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధినేత మల్లికార్జున ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపాన్ని, సానుభూతిని తెలియజేశారు.












Click it and Unblock the Notifications