దేశంలో పెరుగుదల బాట పట్టిన కరోనా యాక్టివ్ కేసులు: తగ్గుతోన్న డిశ్చార్జీల ఫలితం?
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రాణాంతక కరోనా వైరస్ తీవ్రత మళ్లీ పెరుగుదల బాట పట్టినట్టు కనిపిస్తోంది. దేశంలో రోజువారీగా నమోదవుతోన్న కొత్త పాజిటివ్ కేసుల సంఖ్య 40 వేల నుంచి దిగట్లేదు. అదే సమయంలో- కరోనా బారి నుంచి కోలుకుని డిశ్చార్జి అవుతోన్న పేషెంట్ల సంఖ్య కూడా తగ్గుముఖం పడతున్నట్లు కనిపిస్తోంది. ఫలితంగా- యాక్టివ్ కేసులు పెరుగుతున్నాయి. మొదట్లో అంచనాలకు మించిన స్థాయిలో తగ్గిన రోజువారీ డిశ్చార్జీల్లో వేగం మందగించింది. దాని స్థానంలో పెరుగుదల చోటు చేసుకుంది.
దేశంలో కొత్తగా 43,082 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 492 మంది మరణించారు. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసులు 93,09,788కి చేరుకున్నాయి. ఇందులో 87,18,517 మంది డిశ్చార్జి అయ్యారు. మరణించిన వారి సంఖ్య లక్షా 35 వేలను దాటేసింది. ఇప్పటిదాకా కరోనా బారిన పడి 1,35,715 మంది మృతి చెందారు. 4,55,555 యాక్టివ్ కేసులు నమోదు అయ్యాయి. కొద్దిరోజులుగా ఈ సంఖ్య క్రమంగా పెరుగుతోండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచ దేశాల్లో కరోనా మృతుల్లో భారత్ మూడో స్థానంలో కొనసాగుతూనే ఉంది. అమెరికా, బ్రెజిల్ తరువాత ఆ స్థాయిలో మరణాలు సంభవించింది భారత్లోనే.
దేశ రాజధానిలో కరోనా వైరస్ సెకెండ్ వేవ్ తరహా పరిస్థితులు నెలకొంటున్నాయి. కొద్దిరోజుల పాటు తగ్గుముఖం పట్టినట్టు కనిపించిన కరోనా తీవ్రత మళ్లీ మొదటికొస్తోంది.. క్రమక్రమంగా. మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, తమిళనాడుల్లోనూ అదే తరహా వాతావరణం నెలకొంది. గురువారం నాటి బులెటిన్ ప్రకారం చూసుకుంటే.. ఢిల్లీలో 5,475 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 91 మంది మరణించారు. ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 8,811కు చేరుకుంది. ఏపీ, తెలంగాణల్లో ఆ స్థాయి పరిస్థితులు లేవు.
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటిదాకా 13,70,62,749 కోట్ల నిర్ధారణ పరీక్షలను నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) అధికారులు వెల్లడించారు. గురువారం ఒక్కరోజే 11,31,204 శాంపిళ్లను పరీక్షించామని, కరోనా మరణాల రేటు 1.5 శాతంగా నమోదైనట్లు తెలిపారు. 93.6 శాతం మేర పేషెంట్లు కోలుకుంటున్నారని చెప్పారు.