Toll Charges Hike : త్వరలో టోల్ ఛార్జీల పెంపు- ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి ! ఎంతో తెలుసా ?
దేశవ్యాప్తంగా టోల్ ప్లాజాల వద్ద వసూలు చేస్తున్న టోల్ ఛార్జీలకు కు అనుగుణంగా రోడ్లను నిర్వహించడంలో విఫలమవుతున్న NHAI ఇప్పుడు మరోసారి వాటిని పెంచేందుకు సిద్దమవుతోంది.
దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో ఉన్న టోల్ ప్లాజాల్లో ఛార్జీల మోత మోగబోతోంది. ఈ నెలలోనే ఛార్జీల్ని పెంచేందుకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్ధ NHAI సిద్ధమైంది. ఈ మేరకు త్వరలోనే ప్రకటన చేసేందుకు సిద్దమవుతోంది. పెంచిన ఛార్జీలు ఏప్రిల్ 1 నుంచి అంటే వచ్చే ఆర్ధిక సంవత్సరం నుంచి అమల్లోకి రానున్నాయి.
దేశవ్యాప్తంగా ఉన్న టోల్ ప్లాజాల్లో ఛార్జీలు కనీసం 5 నుంచి 10 శాతం పెరగబోతున్నాయి. ఇప్పటికే పలు జాతీయ రహదారులపై టోల్ ఛార్జీలు మోత మోగిస్తుండగా.. ఇప్పుడు వాటిని మరింత పెంచేందుకు NHAI సిద్దమవుతోంది. పలు రాష్ట్రాల్లో టోల్ గేట్ల నిర్వహణపై ఇప్పటికే తీవ్ర వివాదాలు నెలకొన్నాయి.పలుచోట్ల కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి. టోల్ ప్లాజాలు గడువు దాటినా వసూళ్లు చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అయినా NHAI ఇవేవీ పట్టించుకునేందుకు సిద్ధంగా లేదు.

జాతీయ రహదారుల సంస్ధ నిబంధనల ప్రకారం ప్రతీ ఏటా ఛార్జీల్ని సవరించే అధికారం ఉంది. ప్రస్తుత పరిస్దితులు, టోల్ ప్లాజాల్ని దాటుతున్న వినియోగదారుల సంఖ్య, గతంలో వసూలు చేసిన టోల్ ఛార్జీల్ని సమీక్షించి ఈ నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. ఇప్పుడు దాని ప్రకారమే 5 నుంచి 10 శాతం ఛార్జీల్ని పెంచేందుకు NHAI సిద్దమవుతోంది. రెగ్యులర్ టోల్ ఛార్జీలతో పాటు టోల్ పాస్ ల ఛార్జీలు కూడా ఈ మేరకు పెరగబోతున్నాయి. ప్రస్తుతం టోల్ గేట్లకు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాణిజ్యేతర వాహనాలకు రూ.315 రూపాయల ఫ్లాట్ ఛార్జీ వసూలు చేస్తున్నారు. ఇప్పుడు దీన్ని 10 శాతం పెంచబోతున్నారు.












Click it and Unblock the Notifications