Nirbhaya case: రాష్ట్రపతి క్షమాభిక్ష తిరస్కరణపై సుప్రీంకోర్టుకు వినయ్ శర్మ
న్యూఢిల్లీ: నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసులో దోషిగా తేలిన వినయ్ శర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. తన క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ వినయ్ శర్మ తరపున న్యాయవాది ఏపీ సింగ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
గతంలో తనకు విధించిన మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చాలని కోరుతూ వినయ్ శర్మ రాష్ట్రపతికి దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్షమాభిక్ష అభ్యర్థనను ఫిబ్రవరి 1న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తిరస్కరించారు. నిర్భయ దోషులను ఫిబ్రవరి 1న ఉరితీయాల్సి ఉండగా... చివరి నిమిషంలో వాళ్లు ఉరిశిక్ష అమలుపై స్టే విధించాల్సిందిగా ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు.

ఈ క్రమంలో జనవరి 31న ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టు ఉరిశిక్ష అమలును వాయిదా వేస్తూ తీర్పును ఇచ్చింది. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు ఉరి ఆపాలని కోర్టు తీహార్ జైలు అధికారులకు తెలిపింది. కాగా, ఈ కేసులో దోషులైన వాళ్లందరిని ఒకేసారి ఉరితీయాలని, న్యాయపరమైన అవకాశాలను ఉపయోగించుకోవడానికి వారికి ఢిల్లీ హైకోర్టు గడువు ఇవ్వడాన్ని సవాలు చేస్తూ కేంద్రం దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.
కాగా, ఈ కేసులో ఇప్పటి వరకు నలుగురు నిందితుల్లో ఒకరైన పవన్ గుప్తా రివ్యూ పిటిషన్ మాత్రమే దాఖలు చేశాడు. అతనికి ఇంకా క్యురేటివ్ పిటిషన్ క్షమాభిక్ష కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. నిర్భయ కేసులో దోషులు తమకు పడిన శిక్షను ఆలస్యం చేసేందుకే ఉద్దేశ పూర్వకంగా ఒకరి తర్వాత ఒకరు పిటిషన్లు దాఖలు చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. దోషులని తేలిన తర్వాత వారిని శిక్షించకుండా జాప్యం చేయడంపై నిర్భయం తల్లి కూడా మండిపడుతున్నారు.












Click it and Unblock the Notifications