జార్జి ఫెర్నాండేజ్ మృతి: కన్నీరు ఆపుకోలేకపోయారు, విలేకరుల ముందే నితీష్ కంటతడి
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి జార్జి ఫెర్నాండేజ్ మృతిపై మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కంటతడి పెట్టారు. మాజీ రక్షణ మంత్రి జార్జి ఫెర్నాండెజ్ మృతి ఆయనను ఎంతగానో బాధించింది.
Recommended Video
తనకు ఎంతో సన్నిహితుడైన ఫెర్నాండెజ్కు నివాళులర్పిస్తూ నితీశ్ కన్నీటిని ఆపుకోలేకపోయారు. ఆయనతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సమయంలో అందరూ చూస్తుండగానే కన్నీళ్లు పెట్టుకున్నారు.
జార్జి ఫెర్నాండెజ్ అనారోగ్యంతో మంగళవారం ఉదయం ఎయిమ్స్లో తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఫెర్నాండెజ్ గౌరవార్థం బీహార్ ప్రభుత్వం రెండు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. జార్జి ఫెర్నాండేజ్ గురించి నితీష్ మీడియాతో మాట్లాడారు.
ఆయన నాయకత్వం, మార్గదర్శకత్వంలోనే కొత్త పార్టీ ప్రారంభమైందని, ఆయన నుంచి నేర్చుకున్న అంశాలు చాలా కీలకమైనవని, ప్రజల కోసం ఏదైనా చేయాలనే తపన ఆయన నుంచి నేర్చుకున్నదే అన్నారు. ఆయన లేకపోవడం చాలా బాధాకరమన్నారు. ఆయన నుంచి నేర్చుకున్న మార్గదర్శకాలను, ప్రజల హక్కుల కోసం పోరాడేతత్వాన్ని ఎప్పటికీ మర్చిపోనని చెప్పారు.
జార్జి ఫెర్నాండెజ్, నితీశ్ కుమార్ కలిసి 1994లో సమతా పార్టీని స్థాపించారు. తర్వాత నితీశ్ కుమార్ జనతా దళ్(యునైటెడ్) పార్టీని స్థాపించారు. 2003లో ఫెర్నాండెజ్ తన సమతా పార్టీని జేడీయూలో విలీనం చేశారు.