ముఖ్యమంత్రి పదవికి నితీష్ కుమార్ రాజీనామా
లోకసభ ఎన్నికల్లో ఓటమికి తానే నైతిక బాధ్యత వహిస్తున్నానని, అందునకే రాజీనామా చేశానని నితీష్ కుమార్ చెప్పారు. శాసనసభ రద్దుకు సిఫార్సున చేయలేదని ఆయన చెప్పారు. ఎన్డియె నుంచి తప్పుకున్నందుకు చింతించడం లేదని ఆయన చెప్పారు. చేసిన వాగ్దానాలను బిజెపి అమలు చేస్తుందని తాను నమ్ముతున్నానని ఆయన చెప్పారు. లోకసభ ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్డియేకు ఆయన శుభాకాంక్షలు చెప్పారు. మంచి రోజులు వస్తాయని చెప్పారని, వేచి చూద్దామని నితీష్ అన్నారు.
2010లో నితీష్ కుమార్ రెండోసారి బీహార్ ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. ఎన్డీయె భాగస్వామి కావడంతో బిజెపి కూడా ప్రభుత్వంలో చేరింది. అయితే, నరేంద్ర మోడీని బిజెపి ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో జెడియు ఎన్డీయె నుంచి తప్పుకుంది. దీంతో బిజెపికి చెందిన మంత్రులు నితీష్ కుమార్ మంత్రివర్గం నుంచి తప్పుకున్నారు.
నితీష్ కుమార్ తన రాజీనామా లేఖను గవర్నర్కు సమర్పించారు. ఇప్పటికే నితీష్ కుమార్ ప్రభుత్వం మైనారిటీలో పడింది. దీంతో పార్టీలో అసంతృప్తి ఎగిసిపడితే మరింత కష్టంగా మారే అవకాశం ఉందని భావించి ఆయన రాజీనామా చేసినట్లు సమాచారం.