అంబులెన్స్ లేకపోవడంతో ఆలస్యం: సినీనటి మృతి, బిడ్డ కూడా
ముంబై: అంబులెన్స్లు.. సమయానికి వచ్చి ఆపదలో ఉన్నవారికి ప్రాణభిక్ష పెట్టడంలో ముఖ్య పాత్ర పోషించే వాహనాలు. అయితే, కొన్నిసార్లు అనుకోని కారణాల వల్ల ఆలస్యం అవడం లేదా సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఆలస్యం అయితే మాత్రం ప్రాణాలు గాలిలో కలిసిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇలా ఆలస్యం కావడంతో తాజాగా, ఓ సినీనటి ప్రాణం పోయింది. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది.
హింగోలి జిల్లాకు చెందిన పూజ జుంజర్ అనే మరాఠీ నటికి ఆదివారం తెల్లవారుజామున పురిటి నొప్పులు మొదలయ్యాయి. ఆ సమయంలో కుటుంబసభ్యులు ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే, అక్కడ ఆమెకు పుట్టిన బిడ్డ కొద్ది నిమిషాలకే మృతి చెందింది.
ఈ క్రమంలో పూజకు మెరుగైన వైద్యం అందించేందుకు జిల్లా ఆస్పత్రికి రిఫర్ చేశారు ఇక్కడి వైద్యులు. ఆ ఆస్పత్రి దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రభుత్వ అంబులెన్స్ లేకపోవడంతో జాప్యం జరిగింది. దీంతో కుటుంబసభ్యులు ఓ ప్రైవేటు అంబులెన్స్లో ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించారు.
కాగా, అంబులెన్స్ సరైన సమయంలో వచ్చివుంటే పూజ ప్రాణాలు దక్కేవని ఆమె కుటుంబసభ్యులు వాపోయారు. ఆదివారం ఉదయం 2గంటల సమయంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
కాగా, పూజ పలు మరాఠీ సినిమాల్లో నటించారు. గర్భవతి కావడంతో సినిమాలకు కొంత విరామం ప్రకటించి తన సొంత గ్రామానికి వచ్చింది. అంతా సవ్యంగా సాగుతున్న క్రమంలో ఇలాంటి ఘటన వారి కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది.