పౌరసత్వ చట్టంపై అజ్మీర్ దర్గా చీఫ్ దివాన్ సంచలన ప్రకటన..!
జైపూర్: దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించిన పౌరసత్వ సవరణ చట్టంపై ముస్లిం సామాజిక వర్గం నుంచి పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు వ్యక్తమౌతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో.. అజ్మీర్ దర్గా మత పెద్దలు సంచలన ప్రకటన చేశారు. ఈ చట్టాన్ని అమలు చేయడం వల్ల భారత ముస్లింలకు వచ్చిన ముప్పేమీ లేదని అన్నారు. ఆందోళనలను వెంటనే విరమించుకోవాలని ఆయన సూచించారు.
దేశవ్యాప్తంగా చెలరేగుతున్న ఆందోళలను దృష్టిలో ఉంచుకుని అజ్మీర్ దర్గా చీఫ్ దివాన్ జైనుల్ అబెదిన్ అలీ ఖాన్ గురువారం ఆయన అజ్మీర్ లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పౌరసత్వ సవరణ చట్టంపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ఈ చట్టం వల్ల భారత ముస్లింల హక్కులకు గానీ, నివాసానికి గానీ ఎలాంటి ముప్పు వాటిల్లబోదని హామీ ఇచ్చారు. దీనిపై అపోహలను తొలగించుకోవాలని సూచించారు.

తాము భారత పౌరసత్వాన్ని కోల్పోవాల్సి వస్తుందనే అనుమానాలు ఏర్పడటం వల్లే ముస్లింలు ఆందోళనకు గురవుతున్నారని, దీనివల్లే హింసాత్మక పరిస్థితులు, అల్లర్లు చెలరేగుతున్నాయని చెప్పారు. చట్టంలో ఉన్న అంశాలను క్షుణ్నంగా వివరించడానికి అజ్మీర్ దర్గా తరఫున చర్యలు చేపడతామని అలీ ఖాన్ వెల్లడించారు. దీనికోసం త్వరలోనే దర్గా తరఫున ఓ కమిటీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు.

జామియా మిల్లియా ఇస్లామియా యూనివర్శిటీ విద్యార్థులపై ఢిల్లీ పోలీసుల లాఠీఛార్జీని అలీ ఖాన్ తప్పుపట్టారు. క్యాంపస్ లోకి ప్రవేశించి- విద్యార్థులపై లాఠీ ఛార్జీని చేయడం సరికాదని అన్నారు. విద్యార్థులపై దౌర్జన్యానికి, లాఠీ ఛార్జీ చేయకుండా ప్రభుత్వం ఢిల్లీ పోలీసులకు కొన్ని మార్గదర్శకాలను సూచించాలని అలీ ఖాన్ అభిప్రాయపడ్దారు. విద్యార్థులపై లాఠీ ఛార్జీ చేయడం ముమ్మాటికీ తప్పేనని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications