ఐదు రాష్ట్రాల ఫలితాలు: రాహుల్ భారమేనా?, కాంగ్రెస్లో తిరుగుబాటు!
న్యూఢిల్లీ: తాజాగా వెలువడిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఇతర పార్టీల కన్నా కాంగ్రెస్ పార్టీని ఎక్కువగా సందిగ్ధంలో పడేశాయని చెప్పుకోవచ్చు. ఆ పార్టీకి కాబోయే అధ్యక్షుడిగా చెప్పుకుంటున్న ప్రస్తుత ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ.. ఐదు రాష్ట్రాల్లో చేసిన ఎన్నికల ప్రచారం ఆ పార్టీకి ఏ మాత్రం ఉపయోగపడినట్లు కనిపించడం లేదు.
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి కేవలం రెండు రాష్ట్రాల్లో మాత్రమే పూర్తి అధికారం వచ్చేలా కనిపిస్తోంది. ఈ గెలు కూడా కాంగ్రెస్ పార్టీ తమ నాయకుడిగా చెప్పుకుంటున్న రాహుల్ గాంధీ ప్రభావం కాదనే వాదనలు వినిపిస్తుండటం గమనార్హం. ఆ రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికలు, ఆ తర్వాత జరిగిన పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, తాజాగా జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి అంత సానుకూలంగా రాకపోవడంతో రాహుల్ గాంధీ నాయకత్వంపై ఆ పార్టీలోని పలువురు నేతలు అసహనంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరికొందరైతే ఆయన నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ ప్రకటనలు కూడా చేస్తున్నారు. తాజా ఫలితాల అనంతరం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అభిషేక్ సింఘ్వీ కాంగ్రెస్ పార్టీలో భారీ ప్రక్షాళన అవసరమని అభిప్రాయపడటం గమానర్హం.
అఖిలేష్తో కలిసి ప్రచారం చేసినా..
ఉత్తరప్రదేశ్ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఉన్న రాహుల్ గాంధీ. అక్కడి అధికార పార్టీ సమాజ్వాదీ పార్టీతో కలిసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. ఎస్పీ నేత, సీఎం అఖిలేష్ యాదవ్తో కలిసి రాష్ట్రంలో ముమ్మర ప్రచారం నిర్వహించారు. అధికారం తమదేనంటూ,, ప్రధాని నరేంద్ర మోడీ వయస్సు కారణంగా విరామం తీసుకుంటే మంచిదని పేర్కొంటూ విస్తృతంగా ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహించారు. కానీ, ఫలితాల్లో మాత్రం ఎస్పీతోపాటు కాంగ్రెస్ కూడా చతికిల పడింది. ఈ రెండు పార్టీలు కూడా డబుల్ డిజిట్స్ స్థానాలకే పరిమితం కావడం గమనార్హం. బీజేపీ మాత్రం ఉత్తరప్రదేశ్ చరిత్రలోనే అత్యధిక స్థానాలు దక్కించుకున్న ఏకైక పార్టీగా అవతరించడం గమనార్హం.
ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేకతే..
పంజాబ్ రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ అధికారం చేజిక్కించుకునేందుకు సిద్ధమైంది. అయితే, ఇక్కడ మాత్రం ప్రభుత్వంపై వ్యతిరేకతే కాంగ్రెస్ పార్టీకి వరంగా మారినట్లు స్పష్టమవుతోంది. ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఏమాత్రం ప్రభావం చూపకపోవడం, అధికార శిరోమణి అకాళీదళ్-బీజేపీ కూటమి ప్రభుత్వంపై ప్రజలుకున్న వ్యతిరేకతే కాంగ్రెస్ పార్టీకి కలిసొచ్చింది. అంతేగాక, బీజేపీలో కీలక నేతగా ఉన్న నవజ్యోత్ సిద్ధూ కాంగ్రెస్ పార్టీలో చేరడం కూడా ఆ పార్టీకి అమితమైన బలాన్ని చేకూర్చింది.
ప్రచార ఫలితం లేదు..
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో చోటు చేసుకున్న అవినీతి ఆరోపణలు బీజేపీకి కలిసి వచ్చాయి. దీంతో అక్కడ కాంగ్రెస్ పార్టీ తరపున రాహుల్ గాంధీ ప్రచారం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఉత్తరాఖండ్ లో ఎలాగైనా ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలని ఎంతో ప్రయత్నించిన కాంగ్రెస్ పార్టీకి ఏ మాత్రం కలిసి రాలేదు.
గోవాలో సానుకూలమే కానీ..
గోవాలో మాత్రం కాంగ్రెస్ పార్టీ కొంత సానుకూల వాతావరణాన్ని కల్పించుకుంది. అక్కడ బీజేపీ ప్రభుత్వానికి ప్రజల మద్దతు ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ.. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందుకు తీసుకెళ్లడంలో సఫలీకృతమైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ ప్రచారం అక్కడి పార్టీకి కొంత కలిసి వచ్చిందని చెప్పవచ్చు. కానీ, అక్కడ రాహుల్ వల్లే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చాయని చెప్పుకోలేము.
స్థానిక ప్రభుత్వం వల్లే...
ఇక మణిపూర్ విషయానికొస్తే.. అక్కడ స్థానికంగా ఉన్న ప్రభుత్వానికి ప్రజల్లో కొంత వరకు మద్దతు ఉంది. మోడీ, అమిత్ షా సహా బీజేపీ అగ్రనాయకులు విస్తృతంగా ప్రచారం చేసినప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత మెజార్టీ తెచ్చుకోలేకపోయింది బీజేపీ, అక్కడ సీఎంగా కొనసాగుతున్న ఇబోబీసింగ్పై ప్రజలకు ఉన్న సానుకూల అభిప్రాయమే మణిపూర్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నిలబెట్టిందని చెప్పవచ్చు. మొత్తంగా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీకి ఆశాకిరణంగా భావిస్తున్న రాహుల్ గాంధీ పార్టీకి పునర్ వైభవం తీసుకొచ్చే అవకాశాలు మాత్రం కనిపించడం లేదనే చెప్పవచ్చు.