ఏపీకి స్పెషల్ ప్యాకేజీయే.. ప్రత్యేక హోదా లేదు.. రాజ్యసభలో కేంద్రం ప్రకటన
ఢిల్లీ : ఏపీకి ప్రత్యేక హోదా లేనట్లేనా? ప్రత్యేక ప్యాకేజీతోనే సరిపెట్టుకోవాలా? ఇలాంటి ప్రశ్నలకు తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయం అవుననే సమాధానమిస్తోంది. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కల్పించాలని రాజ్యసభలో టీడీపీ సభ్యుడు రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు జవాబిచ్చిన కేంద్రం అలాంటిదేమీ లేదని తేల్చి చెప్పింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని మరోసారి స్పష్టం చేసింది. స్పెషల్ ప్యాకేజీ ఇప్పటికే ప్రకటించామని పేర్కొంది.
14వ ఆర్థిక సంఘం నివేదికను బేస్ చేసుకుంటే ప్రత్యేక హోదా అమలులో లేదని తెలిపింది కేంద్రం. అందుకే దాని బదులు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించామని.. విదేశీ సంస్థల ద్వారా ఏపీకి ఆర్థిక సహకారం అందిస్తున్నామని స్పష్టం చేసింది. అదలావుంటే స్పెషల్ స్టేటస్ తో పాటు విభజన హామీలన్నింటినీ నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్ ఆవరణలో టీడీపీ ఎంపీలు నిరసనకు దిగారు.