మధ్యప్రదేశ్లో ఒంటరిపోరే, చర్చల్లేవు: కాంగ్రెస్కు మాయావతి షాక్
భోపాల్: బీజేపీకి వ్యతిరేకంగా ఉండే అన్ని పార్టీల సహకారంతో మధ్యప్రదేశ్లో ఎన్నికలకు వెళ్దామనుకున్న కాంగ్రెస్ పార్టీకి ఆదిలోనే చుక్కెదురైంది. కాంగ్రెస్ పార్టీతో ప్రస్తుతానికి ఎలాంటి పొత్తు లేదని, ఒంటరిగానే ముందుకు వెళ్లాలని బీఎస్పీ అధినేత్రి మాయావతి యోచిస్తున్నారు. 230 నియోజకవర్గాల్లో ఒంటరిగా పోటీ చేసేందుకు మాయావతి సిద్ధమవుతున్నారు.
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తుకు సంబంధించి ఆ పార్టీతో సంప్రదింపులు జరపడం లేదని బీఎస్పీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. రాష్ట్రస్థాయిలో కాంగ్రెస్, బీఎస్పీల మధ్య పొత్తుపై ఎలాంటి చర్చలు జరగడం లేదన్నారు. కేంద్రస్థాయిలోనూ పొత్తులపై ఎలాంటి సంప్రదింపులు లేవని చెబుతున్నారు.
కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియాకు పట్టు ఉన్న గ్వాలియర్ - చంబల్ ప్రాంతంలో సీట్ల సర్దుబాటుపై ఇరు పార్టీలలో విభేదాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఆ ప్రాంతంలో బీఎస్పీకి ప్రాబల్యం ఉండటంతో ఇరు పార్టీలు అధిక సీట్లు కోరుతుండటం వల్లే పొత్తుకు అవరోధాలు ఏర్పడ్డాయని అంటున్నారు.
బీఎస్పీతో పొత్తు చర్చలపై కాంగ్రెస్ సైతం ఆచితూచి స్పందించింది. తాము బీఎస్పీ పేరును ఎక్కడా ప్రస్తావించలేదన్నారు. భావసారూప్య పార్టీలతో కలిసి బీజేపీని ఎదుర్కొంటామని మాత్రమే చెబుతున్నామని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ మీడియా సెల్ చీఫ్ మనక్ అగర్వాల్ అన్నారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది నవంబర్-డిసెంబర్లో జరగనున్నాయి.