మోదీకి భారీ షాక్ -ఈ పాపం మనకొద్దు -ఇందిరకే మృత్యువు తప్పలేదు -రైతు ఉద్యమంపై మేఘాలయ గవర్నర్
ఆయన కేంద్రం చేత నియమితుడైన ఓ రాష్ట్ర గవర్నర్.. పైగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఎంతో ఇష్టుడు కూడా.. తాను పనిచేసిన కాలంలో బీహార్, జమ్మూకాశ్మీర్ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసి, బీజేపీ చిరకాల వాంఛ ఆర్టికల్ 370 ఎత్తివేతను దగ్గరుండి అమలు చేయించిన ఘటికుడు.. కాలక్రమంలో తీవ్ర స్థాయి విమర్శలు ఎదుర్కొన్నా కేంద్ర పెద్దలు ఆయనను రీప్లేస్ చేశారేతప్ప వేటు దిశగా పోలేదు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఏకంగా మోదీ సర్కారునే ధిక్కరించినంత పనిచేశారు. అవసరమైతే ఎలాంటి తెగింపుకైనా సిద్ధంగా ఉన్నానని హెచ్చరికలు జారీ చేశారు..

కేంద్రంపై గవర్నర్ గుస్సా
ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర సర్కారు విధానాలపై మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక సంచలన వ్యాఖ్యలు చేశారు. సంస్కరణల పేరుతో మోదీ సర్కార్ తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాల వల్ల రైతులకు ఇసుమంతైనా మేలు జరగదని, ఏ చట్టాలూ రైతులను దోపిడీ నుంచి కాపాడలేదని అన్నారు. న్యాయమైన హక్కుల కోసం రైతులు చేస్తోన్న ఉద్యమంపై కేంద్రం ఉక్కుపాదం మోపడం సమంజసం కాదని, అన్నదాతల ఉసురు పోసుకోరాదని హితవుపలికారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా గడిచిన మూడు నెలలుగా ఉద్యమిస్తోన్న రైతులకు ఆయన సంఘీభావం తెలిపారు. గతంలో కీలక సమయంలో జమ్మూకాశ్మీర్ గవర్నర్ గా చేసి, ప్రస్తుతం మేఘాలయకు గవర్నర్ గా వ్యవహరిస్తోన్న సత్యపాల్ మాలిక్ కామెంట్లు సర్వత్రా చర్చనీయాంశం అయ్యాయి. ఆదివారం తన సొంతూరు బాగ్పట్(ఉత్తరప్రదేశ్)లో మీడియాతో మాట్లాడుతూ మాలిన్ అనేక విషయాలు చెప్పుకొచ్చారు..

ఆ పాపం మనకొద్దు..
''కేంద్రం తీసుకొచ్చిన సాగు చట్టాలేవీ రైతులకు ఫేవర్ గా లేవు. కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)కి చట్టబద్ధత కల్పించాలన్న డిమాండ్ న్యాయమైనది. అందుకు కేంద్రం అంగీకరిస్తే రైతులే పశ్చాతాపం చెందుతారు. రైతుల డిమాండ్లను సానుకూలంగా పరిశీలించాలని, వారిపై దమనకాండకు దిగొద్దని ఇదివరకే ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలను నేను కోరాను. ఏ దేశానికైనా రైతులు, సైనికులు చాలా ముఖ్యమైనవాళ్లు. వారిని కాపాడుకోవడం ప్రభుత్వ విధి. కిసాన్లు, జవాన్లు బాధపడే ఏ దేశమూ ప్రగతి సాధించలేదు. అందుకే నా పరిధిలో నేను రైతులకు మద్దతుగా నిలబడ్డాను. రైతు నేత రాకేశ్ టికాయత్ ను అరెస్టు చేయబోతున్నారని తెలిసి, ఆ పని చేయొద్దని కేంద్రాన్ని వారించాను. నిజానికి..

రైతులు పేదలుగా, ఉద్యోగులు మాత్రం..
దేశంలో రైతులు రోజు రోజుకూ ఇంకాస్త పేదరికంలోకి కూరుకుపోతున్నారు. అదే ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బందికి మాత్రం ఏటేటా వేతనాలు పెరుగుతూనే ఉంటాయి. రైతు తాను పండించిన పంట అమ్మేటప్పుడు తక్కువ ధర పొందుతుండగా, తిరిగి నిత్యావసరాలను కొనేటప్పుడు ఎక్కువ ధరకు కొంటున్నాడు. ఈ తతంగం తెలియకుండానే రైతులు పేదోళ్లుగా మారిపోతున్నారు. ఇలా ఎందుకు జరుగుతోందనే పరిశీలనా వారికి కరువైంది. ఇప్పటికైనా మేల్కొని ఉద్యమిస్తున్నారు. సాగు చట్టాలపై రైతులకు చాలా సందేహాలు ఉన్నాయి. వాటికి సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది. చట్టాలను సరిదిద్దాలి. రైతుల విషయంలో నేను ఎంత దూరమైనా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాను. చివరిగా..

సిక్కులు పగ పడితే అంతే గతి..
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతోన్న ఉద్యమంలో సిక్కు రైతులు అగ్రభాగన ఉన్నారు కనుక ఈ సందర్భంగా నేనొక విషయాన్ని గుర్తుచేస్తాను. సిక్కులు తమకు జరిగే ఏ ఉదంతాన్ని, అన్యాయాన్ని అంత సులువుగా మర్చిపోరు. వాళ్లుగానీ పంతం పడితే 300 సంవత్సరాలకు కూడా వెనక్కి తగ్గబోరు. అంతెందుకు, సిక్కులతో పగ పెట్టుకున్న ఇందిరా గాంధీకే మృత్యువు తప్పలేదు. నెహ్రూ కుటుంబీకుడు, ఒకప్పుడు ఇందిరా గాంధీకి ఆప్తుడిగా వ్యవహరించిన అరుణ్ నెహ్రూ నాకొక విషయం చెప్పారు. అదేంటంటే..

వారే చంపుతారని ఇందిరకు తెలుసు
ఆపరేషన్ బ్లూ స్టార్(సర్వర్ణదేవాలయంలో ఖలిస్తానీ ఉగ్రవాదుల ఏరివేత) తర్వాత నాటి ప్రధాని ఇందిరా గాంధీ 'మృత్యుంజయ మంత్ర జపం' నిర్వహించారు. విదేశాల్లో చదువుకుని, తండ్రిలాగే రేషనల్ గా ఆలోచించే ఇందిర.. హోమాలు చేయడం దగ్గరి వాళ్లనూ ఆశ్చర్యపర్చింది. ఇదే విషయాన్ని అరుణ్ నెహ్రూ అడిగాడట. అప్పుడు ఇందిర.. 'మీకు తెలియదు, నేను వారి 'అకల్ తఖ్త్'(స్వర్ణ దేవాలయాని)కి నష్టం కలిగించాను. వాళ్లు నన్ను విడిచిపెట్టరు' అని బదులిచ్చారట. తర్వాత జరిగిందేంటో మనందరికీ తెలుసు. కాబట్టి సిక్కు రైతులతో తగువులు వద్దని, అందరకీ న్యాయం జరిగే పరిష్కారాన్ని చూపాలని ప్రధాని మోదీని, హోం మంత్రి అమిత్ షాను నేను కోరుతున్నాను..'' అని సత్యపాల్ మాలిక ముగించారు. మేఘాలయ గవర్నర్ సంచలన వ్యాఖ్యలపై కేంద్రం ఇంకా స్పందించలేదు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications