డీఆర్డీఓ భవన్లో బాంబు స్వాధీనం: ఎన్ఎస్జీ ఛీప్ సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: నేషనల్ సెక్యూరిటీ గార్డ్సు (ఎన్ఎస్జీ) డైరెక్టర్ జనరల్ ఆర్సీ తయాల్ మంగళవారం సంచలన వ్యాఖ్యాలు చేశారు. రాజధాని ఢిల్లీలోని డీఆర్డీఓ భవన్లో పేలని ఐఈడీ బాంబుని ఇటీవలే ఎన్ఎస్జీ భద్రతా సిబ్బంది స్వాధీనం చేసుకుని నిర్వీర్యం చేశాయని పేర్కొన్నారు.
దీనిపై డీఆర్డీఓతో పాటు ఇంటలిజెన్స్ బ్యూరో (ఐబీ) దర్యాప్తునకు ఆదేశించాయని అన్నారు. ఈ ఘటన ఏప్రిల్ నెలలో జరిగిందని, ఎన్ఎస్జీ సిబ్బంది మూడు ప్కాకెట్ల జిలెటన్ లాంటి పదార్దాన్ని స్వాధీనం చేసుకుందని ఆయన తెలిపారు. డీఆర్డీఓ భవన్కు అతి సమీపంలో నిర్మాణంలో ఉన్న భవనాలను పేల్చేందుకు దీనిని ఉపయోగించే అవకాశం ఉండి ఉండొచ్చని ఆయన అన్నారు.

మూడు ప్యాకెట్ల జిలెటన్ను మెట్కాల్ఫీ హౌస్గా పిలవబడే పురాతన డీఆర్డీఓ బిల్డింగ్ వద్ద స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. తాము స్వాధీనం చేసుకున్న ప్యాకెట్లు చాలా పాతవని, ఇక ఎలాంటి భయం లేదని చెప్పారు. కాగా పఠాన్ కోట్లో జరిగిన ఉగ్రదాడిపై కూడా అయన స్పందించారు.
పఠాన్ కోట్ ఆపరేషన్లో పాల్గొన్న ఎన్ఎస్జీ సిబ్బంది కేవలం అరగంటలోనే నలుగురు ఉగ్రవాదులను అంతమొందించారని అన్నారు. ఈఏడాది జనవరిలో జరిగిన పఠాన్ కోట్ ఉగ్రదాడిపై మీడియా నాలుగు రోజుల పాటు కవరేజి ఇచ్చింది. సుమారు రెండు రోజుల పాటు పఠాన్ కోట్ ఆపరేషన్ సాగిన సంగతి తెలిసిందే.
ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలోని సామ్లాకా ప్రాంతంలో ఎన్ఎస్జీ కోసం నిర్మించిన కొత్త భవంతి ప్రారంభోత్సవంలో తయాల్ పై వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.












Click it and Unblock the Notifications