సీఎం పీఠంపై శశికళ మరో ఎత్తు: పన్నీరుకు ఉద్వాసన, తెరపైకి పళనిస్వామి
ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వంకు అన్నాడీఎంకే అధినేత్రి శశికళ మంగళవారం నాడు గట్టి షాక్ ఇచ్చారు. తనకు ఎదురు తిరిగిన పన్నీరును పార్టీ నుంచి తొలగించారు.
చెన్నై: ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వంకు అన్నాడీఎంకే అధినేత్రి శశికళ మంగళవారం నాడు గట్టి షాక్ ఇచ్చారు. తనకు ఎదురు తిరిగిన పన్నీరును పార్టీ నుంచి తొలగించారు. అ్ననాడీఎంకే శాసన సభా పక్ష నేతగా తెరపైకి పళనిస్వామి పేరును తెచ్చారు.
ఓ వైపు సుప్రీం కోర్టు తీర్పుతో పన్నీరు సెల్వం వర్గీయుల్లో ఆనందోత్సహాలు వెల్లువిరుస్తుంటే శశికళ వర్గం మాత్రం షాకిచ్చింది. పన్నీరు సెల్వంను పార్టీ నుంచి తొలగించినట్లు శశికళ వర్గం ప్రకటించడం గమనార్హం. పార్టీలో ఆయన ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేశారు.
ఇటీవలే అన్నాడీఎంకే శాసన సభా పక్ష నేతగా శశికళ ఎన్నికయ్యారు. అక్రమాస్తుల కేసులో ఆమెకు సుప్రీం కోర్టు నాలుగేళ్ల జైలుశిక్ష విధించడంతో పళని స్వామిని శాసన సభా పక్ష నేతగా ఎంపిక చేశారు. దీంతో తమిళనాట రాజకీయం మళ్లీ రసకందాయంలో పడింది.
సుప్రీం కోర్టు తీర్పు వెలువడిన తర్వాత తమిళనాడు రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి పీఠం కోసం ఎదురు చూసిన శశికళకు సుప్రీం తీర్పుతో నిరాశే మిగిలింది.
అంతకుముందు, దీంతో పన్నీరు సెల్వం ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకునేందుకు శశికళ శిబిరం సెంగొట్టియ్యన్, పళని స్వామి పేర్లను తెరపైకి తీసుకు వచ్చారు. శశికళ కోర్టులో లొంగిపోవాలని న్యాయస్థానం ఆదేశించిన నేపథ్యంలో.. తర్జన భర్జన అనంతరం పళనిస్వామిని ప్రకటించారు.