ఓఖీ తుపాను: తమిళనాడు, కేరళలో 14 మంది మృతి, 48 గంటల్లో ముంబై, గుజరాత్ కు ఎఫెక్ట్ !
చెన్నై: ఓఖీ తుపాను కారణంగా తమిళనాడు, కేరళలో 14 మంది మరణించారని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు అధికారికంగా దృవీకరించాయి. ఇప్పటి వరకూ భారత నావీకా దళం, సముద్ర తీర గస్తి దళాలు 223 మంది మత్య్సకారులను రక్షించారు. ఇంకా చాల మంది సముద్రంలో గల్లంతు అయ్యారని మత్య్సకారులు ఆరోపిస్తున్నారు. సముద్రంలో గల్లంతు అయిన వారి కోసం భారత నావీకా దళం, సుముద్ర తీర గస్తీ దళాలు గాలిస్తున్నాయి.
ముంబై, గుజరాత్ కు తుపాను
తమిళనాడు, కేరళ రాష్ట్రాలను దాటుతున్న ఓకీ తుపాను 48 గంటల్లో ముంబై, గుజరాత్ రాష్ట్రాలను తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వాతావరణ శాఖ హెచ్చరికలతో మహారాష్ట్ర, గుజరాత్ ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి.
లక్షద్వీప్ లోని ప్రజలు !
కేంద్ర పాలిత ప్రాంతం లక్షద్వీప్ను ఓఖీ తుపాను అతలాకుతలం చేసింది. ఓఖీ తుపాను కారణంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా లక్షద్వీప్ లో అనేక ఇళ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయి. అనేక కుటుంబాలు రోడ్డున పడ్డాయి. బలమైన ఈదురు గాలులతో వేలాది సంఖ్యలో కొబ్బరి చెట్లు నేలకూలాయి.
మొబైల్ టవర్లు, విద్యుత్ స్తంభాలు !
లక్షద్వీప్ లో మొబైల్ టవర్లు, విద్యుత్ స్తంభాలు కుప్పకూలడంతో సమాచార వ్యవస్థ దెబ్బతింది. మినికోయి దీవిలో శనివారం ఉదయం వరకు 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. మినికోయి, కల్పెనీ ప్రాంతాల్లో అనేక ఇళ్లు కుప్పకూలిపోయాయి. గంటకు 140 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
24 గంటల్లో భారీ వర్షాలు
ఓఖీ తుపాను కారణంగా వచ్చే 24 గంటల్లో లక్షద్వీప్ లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. కన్యాకుమారిలోనూ ఓఖి తుపాను బీభత్సం సృష్టించింది. భారీ వర్షాల కారణంగా జనజీవనం స్తంభించింది.
అంధకారంలో కన్యాకుమారి !
శనివారం ఉదయం వరకూ 15 సెంటీమీటర్ల వర్షం కురవడంతో ఎక్కడ చూసినా నాలుగు అడుగుల ఎత్తులో నీరు నిలిచిపోయింది. కన్యాకుమారి జిల్లాలోని ప్రజలు అంధకారంలో ఉండిపోయారు. అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు.