దేశం మొత్తం కొత్త ఏడాది వేడుకల్లో మునిగిన వేళ- కేంద్రం మామూలుగా వాత పెట్టలేదుగా..!!
న్యూఢిల్లీ: దేశం మొత్తం కొత్త సంవత్సరం వేడుకల్లో మునిగింది. దేవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. లక్షలాది మంది భక్తులు తమ ఇష్ట దైవాలను కొలుస్తోన్నారు. తిరుమల సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు పోటెత్తాయి. ఆదివారం సెలవు రోజు కూడా కలిసి రావడంతో అటు పర్యటక ప్రాంతాలు కూడా జనసమ్మర్థం అయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా పలు పర్యటక కేంద్రాల్లో కోలాహలం నెలకొంది.

చడీ చప్పుడు లేకుండా..
ఈ పరిస్థితుల మధ్య కేంద్ర ప్రభుత్వం చడీ చప్పుడు లేకుండా జనానికి వాత పెట్టింది. వాణిజ్య అవసరాల కోసం వినియోగించే వంటగ్యాస్ సిలిండర్ రేటును పెంచేసింది. ఒక్కో సిలిండర్ పై 25 రూపాయల మేర పెంచాయి చమురు కంపెనీలు. ఈ తెల్లవారు జాము నుంచి ఈ రేట్లు అమల్లోకి వచ్చేశాయి కూడా. వాణిజ్య అవసరాల కోసం వినియోగించే 19 కేజీల బరువు ఉండే వంటగ్యాస్ సిలిండర్లపై కేంద్ర ప్రభుత్వం ఇదివరకు వరుసగా పలుమార్లు రేట్లను పెంచింది

భారీగా వాత..
2021 నుంచి తరచూ సిలిండర్ రేటును పెంచుతూ వస్తోంది కేంద్ర ప్రభుత్వం. నవంబర్, డిసెంబర్లో ఈ కేటగిరీకి చెందిన వంటగ్యాస్ సిలిండర్లపై మోపిన భారం రూ. 369.50 పైసలు. నవంబర్లో 266 రూపాయలు, డిసెంబర్లో రూ.103.50 పైసలను పెంచింది. ఫలితంగా దేశవ్యాప్తంగా కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల ధరలు ఆకాశాన్నంటాయి. 2,000 రూపాయలను ఎప్పుడో దాటేశాయి.

2022లోనూ..
2022లో మార్చి 1వ తేదీన 105 రూపాయలు, ఏప్రిల్ 1వ తేదీన ఏకంగా 250 రూపాయలను పెంచింది కేంద్ర ప్రభుత్వం. మే 1వ తేదీన కూడా 100 రూపాయల భారాన్ని అధికంగా మోపింది. ఫలితంగా- పలు నగరాల్లో వాణిజ్య సిలిండర్ల ధర 2,400 రూపాయలను దాటేసింది. ఈ పెంపు పట్ల దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. హోటళ్ల మనుగడ తలకిందులైంది.

కమర్షియల్ వంటగ్యాస్పై
కమర్షియల్ వంటగ్యాస్ను వినియోగించే చిరు వ్యాపారులు ఇప్పటికే అనేక ఇక్కట్ల బారిన పడ్డారు. దీనికి తోడు హోటళ్లల్లో వినియోగించే సిలిండర్ల ధర పెరగడం వల్ల వ్యాపార కార్యకలాపాలు మరింత దెబ్బతిన్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని కిందటి సంవత్సరం కమర్షియల్ ఎల్పీజీ వంటగ్యాస్ సిలిండర్ల రేట్లను రెండుసార్లు తగ్గించింది. ఒకసారి 135 రూపాయల, మరోసారి 36 రూపాయలను తగ్గించింది.

కొత్త ఏడాది తొలి రోజే..
2023 కొత్త సంవత్సరం తొలి రోజే మళ్లీ వాటి రేట్లను పెంచింది. ఒక్కో సిలిండర్ పై 25 రూపాయలను మేర పెంచుతున్నట్లు ప్రకటించింది.
ఈ తాజా చర్యతో దేశ రాజధానిలో ఒక్కో సిలిండర్ రేటు 1,768 రూపాయలకు పెరిగింది. ముంబైలో రూ.1,721, కోల్కతలో 1,870 రూపాయలు, చెన్నైలో 1,971 రూపాయలకు పెరిగింది.

మార్పులేని డొమెస్టిక్..
గృహావసరాల కోసం వినియోగించే వంటగ్యాస్ కనెక్షన్ల ధరలో ఎలాంటి మార్పు లేదు. వాటి రేట్లు యధాతథంగా కొనసాగుతున్నాయి. ఇదివరకు కేంద్ర ప్రభుత్వం దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు పంపిణీ చేసే గృహావసర వంటగ్యాస్ కనెక్షన్ల ధరలో సబ్సిడీని ప్రకటించిన విషయం తెలిసిందే. ఒక్కో గ్యాస్ కనెక్షన్పై 200 రూపాయల సబ్సిడీని ఇచ్చింది.












Click it and Unblock the Notifications