ఒమర్ అబ్దుల్లాకు షాక్: నెలకు రూ.15లక్షల భరణం కోరుతూ కోర్టుకు భార్య
న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా భార్య పాయల్ అబ్దుల్లా షాకిచ్చారు. నెలకు రూ.15లక్షల భరణం కావాలని డిమాండ్ చేస్తూ.. ఆమె కోర్టుకు వెళ్లారు. కాగా, ఇటీవల ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు ఢిల్లీలోని జమ్మూకాశ్మీర్ అధికారిక భవనం అక్బర్ రోడ్లోని ల్యుటెన్స్ నుంచి పాయల్ను అధికారులు ఖాళీ చేయించిన సంగతి తెలిసిందే.
ఢిల్లీలో భవనం ఖాళీ చేసిన తర్వాత తాను, తన ఇద్దరు కుమారులు ఇల్లు లేక, డబ్బు లేక నానా ఇబ్బందులు పడుతున్నామని, ఒమర్ తమకు నెల నెలా డబ్బు చెల్లించాలని పాయల్ డిమాండ్ చేస్తున్నారు.

తనకు, తన ఇద్దరు కుమారులకు మెయింటెనెన్స్ కోసం నెలకు రూ.10లక్షలు ఇవ్వాలని.. నివాసం కోసం రూ.5లక్షలు ఇవ్వాలని పాయల్ కోరుతున్నారు. నివాసం లేకపోవడం వల్ల తన స్నేహితుల ఇళ్లలో ఉండాల్సి వస్తోందని పిటిషన్లో వెల్లడించారు. ఇప్పటి వరకు తనకు, తన కుమారులకు జడ్, జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉండేదని, ఇప్పుడది తొలగించడంతో తమకు భద్రత లేకుండా పోయిందన్నారు.
పాయల్ పిటిషన్ను విచారించిన ఫ్యామిలీ కోర్టు దీనిపై వివరణ ఇవ్వాలని ఒమర్ అబ్దుల్లాకు నోటీసులు పంపినట్లు పాయల్ తరఫు న్యాయవాది వెల్లడించారు. తదుపరి విచారణను అక్టోబరు 27కు వాయిదా వేసినట్లు చెప్పారు.
. భార్యతో విడాకులు కావాలని ఒమర్ దాఖలు చేసిన పిటిషన్ను గత ఆగస్టు 30న ట్రయల్ కోర్టు కొట్టేసిన సంగతి తెలిసిందే. పాయల్ తనను వేధించిందనడానికి ఒమర్ సరైన కారణాలు చూపలేకపోయారని అప్పుడు కోర్టు తెలిపింది. అయితే పాయల్ మాత్రం తాను విడాకులు కోరుకోవట్లేదని తెలిపారు. అయితే, ఒమర్, పాయల్ 2013 నుంచి విడివిడిగా ఉంటున్నారు
కాగా, ఒమర్, పాయల్కు సెప్టెంబర్ 8, 1994లో వివాహం కాగా.. ఇద్దరు కుమారులు ఉన్నారు.












Click it and Unblock the Notifications