లోక్సభ స్పీకర్ ఓం బిర్లా షాకింగ్ నిర్ణయం..
లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కీలక నిర్ణయం తీసుకున్నారు. విపక్షాలు తనకు వ్యతిరేకంగా సభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన నేపథ్యంలో.. ఆ అవిశ్వాస తీర్మానంపై సభలో చర్చ పూర్తయ్యే వరకూ సభకు రాకూడదని నిర్ణయం తీసుకున్నారు. స్పీకర్ ను పదవి నుంచి తొలగించేలా తీర్మానం ప్రవేశపెట్టేందుకు లోక్సభ సెక్రటరీ జనరల్ కు కాంగ్రెస్ పార్టీ నోటీసు ఇచ్చిన తరుణంలో ఓం బిర్లా ఈ నిర్ణయం తీసుకున్నారు.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సభలో ప్రసంగించేందుకు లీడర్ ఆఫ్ అపోజిషన్(ప్రధాన ప్రతిపక్ష నేత) రాహుల్ గాంధీకి.. స్పీకర్ అవకాశం ఇవ్వలేదని కాంగ్రెస్ కీలక ఆరోపణలు చేసింది. అలాగే 8 మంది సభ్యులపై స్పీకర్ సస్పెన్షన్ వేటు వేశారు.. దాంతోపాటు కాంగ్రెస్ మహిళా ఎంపీలపై అనుచిత ఆరోపణలు చేసిన బీజేపీ ఎంపీపైనా చర్యలు చేపట్టలేదన్న తదితర కారణాలతో విపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి.
ఈ క్రమంలో అవిశ్వాస తీర్మానంపై చర్చ పూర్తయ్యే వరకు సభకు రాకూడదని స్పీకర్ ఓం బిర్లా నిర్ణయం తీసుకున్నారు. ఇది తన నైతిక బాధ్యత అని, స్పీకర్ స్థానంపై సందేహాలు వ్యక్తం అయినప్పుడు తక్షణం చర్చ జరగాలనే సందేశం ఇవ్వడానికే ఓం బిర్లా ఈ నిర్ణయం తీసుకున్నట్లు లోక్ సభ సచివాలయ వర్గాలు వెల్లడించాయి.

ఇక మార్చి 9న అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగే అవకాశం ఉంది. అప్పటివరకు ఓం బిర్లా స్పీకర్ సీటుకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇక పార్లమెంటరీ చరిత్రలో స్పీకర్ పై పెట్టిన అవిశ్వాస తీర్మానం ఎప్పుడూ నెగ్గలేదు. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications