Omicron వేరియంట్ వేగంగా వ్యాపిస్తోంది జాగ్రత్త, 70 శాతం వ్యాక్సినేషన్: సీఎంలతో ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్, ఒమిక్రాన్ వేరియంట్ ఉధృతి నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ గురువారం సాయంత్రం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరోనా పరిస్థితిపై ప్రధాని సమీక్షించారు. ముఖ్యమంత్రులకు కీలక మార్గదర్శకాలు, సూచనలు చేశారు.

ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాప్తిస్తోంది..: సీఎంలతో ప్రధాని మోడీ
'ఒమిక్రాన్ వేరియంట్ మునుపటి వేరియంట్ల కంటే చాలా రెట్లు వేగంగా సాధారణ జనాభాకు సోకుతోంది. మనం అప్రమత్తంగా ఉండాలి, కానీ భయాందోళనలకు గురికాకుండా జాగ్రత్త వహించాలి' అని ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. ఈ పండుగల సీజన్లో ప్రజలలో, పరిపాలనలో చురుకుదనం తగ్గకుండా చూడాలి' అని ప్రధాని అన్నారు. కరోనా వైరస్ కట్టడికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. ఆస్పత్రుల్లోనూ కోవిడ్ చికిత్సకు అవసరమైన అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలన్నారు. కరోనా నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

కేంద్రం టెలీ మెడిసిన్కు సంబంధించిన నిబంధనలు
'స్థానిక నియంత్రణ, గృహ ఐసోలేషన్పై దృష్టి పెట్టండి' అని ముఖ్యమంత్రులను ఉద్దేశించి ప్రధాని మోడీ స్పష్టం చేశారు. 'ఏదైనా వ్యూహాన్ని రూపొందించేటప్పుడు సామాన్య ప్రజల జీవనోపాధికి నష్టం జరగకూడదనే విషయం గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. ఆర్థిక వ్యవస్థ పురోగతిని కొనసాగించాలి. కాబట్టి, అది స్థానిక నియంత్రణపై ఎక్కువ దృష్టి పెట్టడం మంచిది' అని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. చాలా కోవిడ్ చికిత్సను హోమ్ ఐసోలేషన్లో చేపట్టాలని ప్రధాని మోడీ సూచించారు. దీని కోసం కేంద్రం టెలీ మెడిసిన్కు సంబంధించిన నిబంధనలను రూపొందించిందని ఆయన చెప్పారు.
దేశంలో 70 శాతం వ్యాక్సినేషన్ పూర్తి, 3 కోట్ల మంది టీనేజర్లకు
'ఈ రోజు భారతదేశం దాదాపు 92 శాతం వయోజన జనాభాకు మొదటి డోస్ అందించడం ప్రతి భారతీయుడికి గర్వకారణం. రెండవ డోస్ కవరేజీ కూడా దేశంలో 70 శాతానికి చేరుకుంది' అని భారతదేశంలో వ్యాక్సినేషన్ డ్రైవ్ గురించి మాట్లాడుతూ వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభించి ఏడాది పూర్తి కావొస్తోందన్నారు. పది రోజుల్లోనే 3 కోట్ల మంది టీనేజర్లకు కోవిడ్ టీకా పూర్తి చేసినట్లు ప్రధాని తెలిపారు. త్వరితగతిన కరోనా టీకా దేశ సామర్థ్యాన్ని తెలుపుతోందన్నారు. రాష్ట్రాల వద్ద పూర్తిస్థాయిలో కోవిడ్ టీకాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ముందుజాగ్రత్త డోస్లను ఫ్రంట్లైన్ కార్మికులు, సీనియర్ సిటిజన్లకు ప్రాధాన్యతపై అందించాలని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. 100 శాతం వ్యాక్సినేషన్ కోసం హర్ ఘర్ దస్తక్ ప్రచారాన్ని మనం ముమ్మరం చేయాల్సి ఉందని ప్రధాని మోడీ అన్నారు.

దేశంలో కరోనా కల్లోలం
మరోవైపు దేశ వ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 2,47,417 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 84,825 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 13.11 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. 24 గంటల్లో గత రోజు కంటే 50 వేల కేసులు పెరిగాయి. గడిచిన ఎనిమిది నెలల కాలంలో తొలి సారిగా భారత్ రెండు లక్షల కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య దాటింది. రాజస్థాన్ లో ఒకే రోజు 10 వేలకు పైగా కరోనా కేసులను గుర్తించారు. ప్రయాగ్ రాజ్ లో 38 మందిని కరోనా పాజిటివ్ బాధితులుగా నిర్దారణ అయింది. దీని ద్వారా దేశంలో ప్రస్తుత యాక్టివ్ కేసుల సంఖ్య 11,17,531 కాగా, పాజిటివిటీ రేటు 13.11 శాతానికి చేరింది. జనవరి నెలాఖరుకు కోవిడ్ కేసుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఓమిక్రాన్ పైన ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక సూచనలు చేసింది. ఫ్లూ ను సాధారణంగా తీసుకోవద్దంటూ హెచ్చరించింది. ఇదే సమయంలో దేశ వ్యాప్తంగా ఓమిక్రాన్ కేసుల సంఖ్య 5,488 కు చేరింది.












Click it and Unblock the Notifications