శ్రీనగర్ లో ఆర్మీ కాన్వాయ్ పై ఉగ్రదాడి: జవాను మృతి
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ లో మళ్లీ ఉగ్రవాదులు రెచ్చిపోయారు. శ్రీనగర్ శివారు ప్రాంతమైన జకురలో శుక్రవారం రాత్రి జరిగిన ఉగ్రదాడిలో ఎస్ఎస్ బీ (సశస్ర సీమా బల్) జవాను మృతి చెందాడు. స్థానిక పోలీసుతో సహ 8 మందికి తీవ్రగాయాలైనాయి.
శుక్రవారం రాత్రి శ్రీనగర్ లో విధులు నిర్వహించిన తరువాత మూడు కంపెనీల జవాన్లు ఆరు వాహనాల్లో తిరిగి తమ శిబిరాలుకు బయలుదేరారు. మార్గం మధ్యలో జకుర సమీపంలో చిన్న వీధిలోంచి ఉగ్రవాదులు వచ్చారు.
ముగ్గురు, నలుగురు ఉగ్రవాదులు జవాన్లు వెలుతున్న కాన్వాయ్ మీద విచ్చలవిడిగా కాల్పులు జరిపి పారిపోయారని ఎస్ఎస్ బీకి చెందిన అధికారి దీపక్ కుమార్ చెప్పారు. భద్రతా దళాలు వెంటనే ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారని అన్నారు.
ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నామని ఎస్ఎస్ బీ అధికారి దీపక్ కుమార్ తెలిపారు. భారత సైనికులపై తామే దాడి చేశామని ఉమర్ ముజాహిదీన్ అనే ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ఆగస్టు 15వ తేదీన నౌహట్లా ప్రాంతంలో ఎన్ కౌంటర్ జరిగింది.
దాని తరువాత ఉగ్రవాదులు నగరంలో దాడి చెయ్యడం ఇదే మొదటి సారి అని ఎస్ఎస్ బీ అధికారి దీపక్ కుమార్ వివరించారు. తీవ్రగాయాలైన జవాన్లను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నామని దీపక్ కుమార్ తెలిపారు.